
ఢిల్లీ: అంతర్జాతీయ టెస్టు క్రికెట్కు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గుడ్బై చెప్పి ఆరు సంవత్సరాలు అయింది. ఈ ఆరు సంవత్సరాల్లో మహీ లాంటి కీపర్, ఆటగాడు జట్టుకు దొరకలేదు. కొందరు అడపా దడపా జట్టులోకి వచ్చిపోతున్నారు. ఈ ఆరేళ్లలో టీమిండియా తన టెస్టు జట్టులో వృద్ధిమాన్ సాహా, రిషబ్ పంత్ లాంటి ఆటగాళ్లను ప్రయత్నించింది. ఇద్దరూ కొన్ని ఇన్నింగ్స్లతో మెరిసేవారే గాని నిలకడగా ఆడిన సందర్భాలు చాలా తక్కువ. అందుకే ఇప్పటికీ టెస్టు జట్టులో వికెట్కీపర్ స్థానం సుస్థిరంగా లేదు. ఈ నేపథ్యంలో టెస్టుల్లో మహీ స్థానాన్ని భర్తీ చేసే సత్తా రిషబ్ పంత్కు ఉందని, ధోనీ వారసుడు పంత్ మాత్రమేనని టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా పేర్కొన్నాడు.
టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ వ్యాఖ్యలకు ఆశిష్ నెహ్రా మద్దతు పలికాడు. 'ఇప్పుడు మనం ఏ ఫార్మాట్ గురించి మాట్లాడుతున్నామనేది ముఖ్యం కాదు. బంగర్ చెప్పిన మాటలను నేను పూర్తిగా సమర్థిస్తాను. రిషబ్ పంత్ను టీమిండియాలో ఆడించాలని కోరుకుంటున్నా. ఈ ఐపీఎల్లో అతను మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఐపీఎల్ ద్వారా పంత్ తిరిగి ఫామ్లోకి వచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్లో ప్రతి ఆటగాడికి మద్దతు అనేది చాలా అవసరం' అని నెహ్రా తెలిపాడు.

ఇదివరకు సంజయ్ బంగర్ మాట్లాడుతూ... 'ఈ ఏడాది ఐపీఎల్లో రిషబ్ పంత్ ప్రారంభించిన విధానం చాలా బాగుంది. లెఫ్ట్ హ్యాండర్, వికెట్ కీపర్గా రాణిస్తున్న పంత్.. టీమిండియా మిడిల్ ఆర్డర్ను బ్యాలెన్సింగ్ చేయడానికి సరిగా సరిపోతాడు. టీమిండియా మిడిల్ ఆర్డర్లో ఎక్కువగా రైట్ హ్యాండర్స్ ఉన్నారు. కాబట్టి టీమిండియా మిడిల్ ఆర్డర్లో లెఫ్ట్ హ్యాండర్ ఉండటం చాలా అవసరం. ధోనీ వారసుడు పంత్' అని పేర్కొన్నాడు.
ప్రస్తుతం రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఐపీఎల్ సీజన్లో మంచి ఫామ్ కనబరుస్తున్నాడు. కీలక సమయంలో బ్యాట్ జుళిపిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్లో 171 పరుగులు చేశాడు. టీమిండియా తరఫున 13 టెస్ట్లు, 16 వన్డేలు, 28 టీ20లు ఆడాడు. అయితే టీమిండియా తరఫున నిలకడగా రాణించడంలో మాత్రం పంత్ విఫలమవుతున్నాడు. ముఖ్యంగా పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో.