
హైదరాబాద్: బీసీసీఐ జూనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసిన మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ స్థానాన్ని అశీష్ కపూర్తో భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్ 11వ సీజన్లో కింగ్స్ లెవన్ పంజాబ్ జట్టుకు వెంకటేశ్ ప్రసాద్ బౌలింగ్ కోచ్గా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు రాకూడదనే వెంకటేశ్ ప్రసాద్ తన పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన జట్టు సభ్యులకు, చీఫ్ కోచ్, సహాయక బృందానికి నజరానాలు ప్రకటించిన బీసీసీఐ సెలెక్షన్ ప్యానెల్ను కనీసం పరిగణనలోకి తీసుకోక పోవడం కూడా ఓ కారణం కావొచ్చు.
దీంతో న్యూజిలాండ్లో జరిగిన అండర్-19 వరల్డ్ కప్ను టీమిండియా కుర్రాళ్లు గెలిచిన నెల రోజుల్లోపే ఆయన రాజీనామా చేయడం గమనార్హం. గత 30 నెలలుగా వెంకటేశ్ ప్రసాద్ ఈ పదవిలో ఉన్నారు. బోర్డు పెద్దలతోనూ సత్సంబంధాలే ఉన్నాయి. అయితే, వ్యక్తిగత కారణాల రీత్యానే రాజీనామా చేస్తున్నట్టు ప్రసాద్ ప్రకటించారు.
ఇప్పుడు అతడి స్థానంలో భారత్ తరఫున నాలుగు టెస్ట్లు, 17 వన్డేలు ఆడిన 46 ఏళ్ల అశీష్ కపూర్ సెలెక్షన్ ప్యానెల్ బాధ్యతలు స్వీకరించనున్నాడు. కపూర్తో పాటు పంజాబ్ మాజీ క్రికెటర్ అమిత్శర్మ ప్యానెల్లో సభ్యునిగా చేరే అవకాశముందని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.