
హైదరాబాద్: క్రికెట్ అభిమానులకు శుభవార్త. ఐదు టెస్టుల యాషెస్ సిరిస్లో చివరిదైన ఐదో టెస్టులో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ ఆడనున్నాడు. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా అధికారిక ప్రకటన చేసింది. కాలి మడమ గాయం కారణంగా మెల్ బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టుకు మిచెల్ స్టార్క్ దూరమైన సంగతి తెలిసిందే.
గాయం నుంచి తిరిగి కోలుకోవడంతో చివరి టెస్టుకు మిచెల్ స్టార్క్ అందుబాటులోకి వచ్చినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ట్విట్టర్లో ప్రకటించింది. ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో చివరిదైన ఐదో టెస్టు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా గురువారం (జనవరి 4)న ప్రారంభం కానుంది.

ప్రస్తుతం ఇంగ్లాండ్తో జరుగుతున్న యాషెస్ సిరిస్లో మిచెల్ స్టార్క్ అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ సిరిస్లో ఇప్పటివరకు స్టార్క్ 21.05 సగటుతో 19 వికెట్లు తీశాడు. గాయం కారణంగా బాక్సింగ్ డే టెస్టుకు స్టార్క్ దూరం కావడంతో అతడి స్థానంలో మరో పేసర్ జాక్సన్ బర్డ్ను తీసుకున్నారు.
ఐదు టెస్టుల యాషెస్ సిరిస్ను ఆస్ట్రేలియా ఇప్పటికే 3-0తో కైవసం చేసుకుంది. మెల్ బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే.