యాషెస్ రెండో టెస్టులో ఆస్ట్రేలియా గెలిచింది. కానీ ఆ జట్టుకు కూడా ఓడిపోతామనే భయం కలిగించాడు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్. చివరి ఇన్నింగ్స్లో ఆకాశమే హద్దుగా చెలరేగిన అతను 214 బంతుల్లో 155 పరుగులతో అదరగొట్టాడు. ఒకానొక సమయంలో ఇంగ్లండ్ను అతనే గెలిపించేలా కనిపించాడు. ఇది చూసిన అభిమానులు స్టోక్స్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
ఈ క్రమంలోనే టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా తన ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. గతేడాది స్టోక్స్ వన్డే క్రికెట్కు వీడ్కోలు పలికాడు. అప్పుడు కోహ్లీ తన భావాలను చెప్తూ.. 'నేను ప్రత్యర్థిగా ఎదుర్కొన్న అత్యంత కాంపిటీటివ్ మనిషివి నువ్వే..' అంటూ మెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆ మాటలను కోహ్లీ మరోసారి గుర్తుచేశాడు. స్టోక్స్ ఇన్నింగ్స్పై ట్వీట్ చేసిన కోహ్లీ.. తాను అప్పుడు జోక్ చేయలేదన్నాడు.

'నేను ప్రత్యర్థిగా ఎదుర్కొన్న అత్యంత కాంపిటీటివ్ ప్లేయర్ స్టోక్స్ అని చెప్పినప్పుడు నేనేం అబద్ధం చెప్పలేదు. ఇది అత్యుత్తమ క్వాలిటీ ఉన్న ఇన్నింగ్స్. కానీ ఆస్ట్రేలియా ఆ మూమెంట్లో మెరుగ్గా ఆడింది' అని కోహ్లీ ట్వీట్ చేశాడు. ఈ మ్యాచ్లో గెలిచిన ఆసీస్.. యాషెస్ సిరీస్లో 2-0 ఆధిక్యం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ స్టార్ జానీ బెయిర్స్టో అవుటైన విధానం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్లో స్టోక్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడలేదు. తన ఇన్నింగ్స్ ఆరంభంలో చాలా జాగ్రత్తగా ఆడిన అతను.. బెన్ డకెట్తో కీలకమైన భాగస్వామ్యం నెలకొల్పాడు. చివర్లో బెయిర్స్టో అవుటైన తర్వాత ఆసీస్ బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. లంచ్కు ముందు ఐదు ఓవర్లలో 50 పరుగులు బాదాడు. కామెరూన్ గ్రీన్ వేసిన ఒక ఓవర్లో ఏకంగా 24 పరుగులు పిండుకున్నాడు. ఈ ఓవర్లో ఏకంగా మూడు సిక్సర్లు బాదాడు.