ఇంగ్లండ్ స్టార్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ పేరు చెప్పగానే.. మిగతా దేశాల్లో ఏం గుర్తుకు వస్తుందో తెలియదు కానీ.. భారత్లో మాత్రం యువరాజ్ సింగ్ బాదిన ఆరు సిక్సులే గుర్తొస్తాయి. ఇంగ్లండ్, ఇండియా ఆడిన మ్యాచ్లో యువీతో ఇంగ్లండ్ కెప్టెన్ ఫ్లింటాఫ్ గొడవ పడ్డాడు. ఆ కోపాన్ని అప్పటి కుర్ర పేసర్ బ్రాడ్పై చూపించాడు యువీ.
అతని బౌలింగ్లో వరుసగా ఆరు సిక్సర్లు బాదాడు. ఈ ఘటనను ఇప్పటికీ క్రికెట్ ఫ్యాన్స్ మర్చిపోలేరు. ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ టెస్టు తన కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ అని బ్రాడ్ తాజాగా ప్రకటించాడు. ఈ సందర్భంగా యువీ బాదిన ఆరు సిక్సర్ల గురించి కూడా బ్రాడ్ ప్రస్తావించాడు. అది ఒక విధంగా తన కెరీర్లో టర్నింగ్ పాయింట్ అని చెప్పాడు.

ఇలా వరుసగా ఆరు సిక్సర్లు బాదించుకున్న చెత్త బౌలర్ ముద్ర చెరిపేసుకున్న బ్రాడ్.. ఇంగ్లండ్ క్రికెట్ చరిత్రలోనే బెస్ట్ పేసర్లలో ఒకడిగా ఎదిగాడు. టెస్టుల్లో 602 వికెట్లు తీసుకొని ఈ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన ఐదో బౌలర్గా నిలిచాడు. అంతేకాదు, అతను ఈ ఘనత సాధించిన కేవలం రెండో పేసర్ కావడం గమనార్హం.
'కచ్చితంగా అది ఎవరికైనా చాలా టఫ్ డే. అప్పుడు నేను 21 లేదా 22 ఏళ్ల కుర్రాడిని. ఆ తర్వాత చాలా నేర్చుకున్నా. ఆ అనుభవం తర్వాత ఒక విధంగా నేను కొత్త మెంటల్ రొటీన్ అలవర్చుకున్నా. ఎందుకంటే.. యువీ ఆ సిక్సర్లు బాదిన క్షణం, ఒక అంతర్జాతీయ క్రికెటర్గా నేను చాలా చెత్తగా ఆడానని అనిపించింది. నా ప్రిపరేషన్స్ వేగం పెంచా' అని వెల్లడించాడు.
'అప్పట్లో నాకు ప్రి-బాల్ రొటీన్స్ ఉండేవి కావు. ఫోకస్ లేదు. ముఖ్యంగా ఈ అనుభవం తర్వాత నేను అలవర్చుకున్న వారియర్ మోడ్ లేదు. ఆ అనుభవం నన్ను అంతగా మార్చింది. అయితే అది జరగకపోతే బాగుండేదనే ఇప్పటికీ అనుకుంటా. అది డెడ్ రబ్బర్ మ్యాచ్ కాబట్టి నేను త్వరగా కోలుకున్నా. లేదంటే నా వల్లే వరల్డ్ కప్ నుంచి నా టీం తప్పుకుందనే గిల్టీ ఫీలింగ్ రాలేదు' అని బ్రాడ్ అన్నాడు.
'అయితే ఆ అనుభవం వల్లనే నేను మరింత మెరుగయ్యా. నాలోని పోటీతత్వాన్ని ఆ ఘటన నిద్రలేపింది. నేను ఇంతలా ఎదగడానికి ఆ క్షణమే కారణం' అని చెప్పుకొచ్చాడీ ఇంగ్లండ్ గ్రేట్. ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ చివరి టెస్టులో అతనికి ఆసీస్ ఆటగాళ్లు గార్డ్ ఆఫ్ ఆనర్తో గౌరవం పలికిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.