యాషెస్ చివరి టెస్టుతో తన అంతర్జాతీయ కెరీర్కు ఇంగ్లండ్ స్టార్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ వీడ్కోలు పలుకుతున్నాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా ప్రకటించాడు కూడా. ఈ క్రమంలోనే అతను నాలుగో రోజు బ్యాటింగ్కు వచ్చినప్పుడు ఆసీస్ ఆటగాళ్లు వచ్చి అతనికి గార్డ్ ఆఫ్ ఆనర్ అందజేశారు.
అంటే బ్రాడ్ మైదానంలోకి వస్తుంటే.. అటూ ఇటూ నిలబడి చప్పట్లు కొడుతూ గౌరవించారు. ఈ సమయంలో బ్రాడ్, ఆండర్సన్ ఇద్దరూ మైదానంలోకి వచ్చారు. వీళ్లిద్దరూ నాలుగో రోజున కేవలం 1.5 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసి, ఓవర్ నైట్ స్కోరుకు ఆరు పరుగులు జత చేశారు. ఈ ఆరు పరుగులు బ్రాడ్ చేసినవే కావడం గమనార్హం.

ఈ మ్యాచ్లో బ్రాడ్ ఎదుర్కొన్న చివరి బంతికి భారీ సిక్సర్ బాదాడు. ఆ తర్వాత కాసేపటికే స్పిన్నర్ టాడ్ మర్ఫీ బౌలింగ్లో ఆండర్సన్ పెవిలియన్ చేరడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. ఇలా సిక్సర్తో తన అంతర్జాతీయ కెరీర్ను చాలా తక్కువ మంది ప్లేయర్లు మాత్రమే ముగించడం గమనార్హం.
ఇక ఇలా కెరీర్ ముగించిన క్రమంలో యువరాజ్ సింగ్ తన బౌలింగ్లో వరుసగా ఆరు సిక్సర్లు బాదిన ఘటనను కూడా బ్రాడ్ గుర్తు చేసుకున్నాడు. దీని తర్వాతనే తన మనస్తత్వం పూర్తిగా మారిందని, ఆటలో చాలా మెరుగయ్యానని చెప్పాడు. అయినా సరే అలా ఆరు సిక్సర్లు బాదించుకోకుండా ఉంటేనే బాగుండేదని నవ్వేశాడు.
ఈ క్రమంలో బ్రాడ్ రిటైర్మెంట్ గురించి యువరాజ్ సింగ్ కూడా స్పందించాడు. బ్రాడ్ ఒక లెజెండ్ అని, రెడ్ బాల్ క్రికెట్లో ప్రత్యర్థులను భయపెట్టే అతికొద్ది మంది బౌలర్లలో ఒకడని మెచ్చుకున్నాడు. ఇంత గొప్ప అంతర్జాతీయ కెరీర్ సాగించినందుకు శుభాకాంక్షలు తెలిపాడు. రిటైర్మెంట్ తర్వాత కామెంటేటర్గా బ్రాడ్ కొత్త అవతారం ఎత్తుతాడని సమాచారం. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.