ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరుగుతున్న యాషెస్ నాలుగో టెస్టులో ఇంగ్లండ్ వెటరన్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అరుదైన ఘనత సాధించాడు. ఈ టెస్టులో 600వ టెస్టు వికెట్ను బ్రాడ్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో క్రికెట్ లెజెండ్స్ షేన్ వార్న్, అనిల్ కుంబ్లే, జేమ్స్ ఆండర్సన్ సరసన చేరాడు. వీళ్లందరూ కూడా టెస్టుల్లో 600పైగా వికెట్లు తీసుకున్న దిగ్గజ బౌలర్లే.
నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్లో తొలుత ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసింది. ఈ ఇన్నింగ్స్లో బ్రాడ్ బంతితో రెండు కీలక వికెట్లు తీసుకున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఉస్మాన్ ఖవాజాను పెవిలియన్ చేర్చిన అతను.. 50వ ఓవర్లో ఆసీస్ స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ను అవుట్ చేశాడు. ఇది టెస్టుల్లో బ్రాడ్కు 600వ వికెట్ కావడం గమనార్హం. క్రికెట్ చరిత్రలో అతి తక్కువ మంది బౌలర్లు మాత్రమే ఈ ఘనత సాధించారు.

ఇప్పుడు బ్రాడ్ కూడా ఈ ఎలైట్ క్లబ్లో చేరాడు. ఇప్పటి వరకు టెస్టుల్లో శ్రీలంక గ్రేట్ ముత్తయ్య మురళీ ధరన్ (800), ఆసీస్ లెజెండ్ షేన్ వార్న్ (708), ఇంగ్లండ్ దిగ్గజం జేమ్స్ ఆండర్సన్ (688), ఇండియా లెజెండ్ అనిల్ కుంబ్లే (619) మాత్రమే ఈ జాబితాలో ఉన్నారు. ఇప్పుడు బ్రాడ్ కూడా ఈ జాబితాలో చేరడంపై ఇంగ్లండ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఇదే మ్యాచ్లో బ్రాడ్ మరో ఘనత కూడా అందుకున్నాడు.
ఇలా 600 టెస్టు వికెట్ల క్లబ్లో కేవలం ఇద్దరు పేసర్లే ఉండటం గమనార్హం. వారిద్దరూ యాషెస్ నాలుగో టెస్టులో ఆడుతున్నారు. ఇక ఈ మ్యాచ్లో బ్రాడ్ తీసిన 600వ టెస్టు వికెట్.. అతనికి ఆస్ట్రేలియాపై 149వది. దీంతో ఆస్ట్రేలియాపై అత్యథిక వికెట్లు తీసిన బౌలర్గా బ్రాడ్ రికార్డు నెలకొల్పాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఇయాన్ బోథమ్ పేరిట ఉండేది. ఈ దిగ్గజ ఆల్రౌండర్.. ఆసీస్పై 148 వికెట్లు తీశాడు. ఇప్పుడు బ్రాడ్ అతన్ని దాటేశాడు.