ఇంగ్లండ్ లెజెండరీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. యాషెస్ సిరీస్ తర్వాత తను అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించాడు. శుక్రవారం సాయంత్రం తన స్నేహితులు, చాలాకాలం తనతో కలిసి ఆడిన జేమ్స్ ఆండర్సన్, జో రూట్ను కలిసిన బ్రాడ్ తన నిర్ణయాన్ని వారికి చెప్పాడు.
ఈ నిర్ణయం చెప్పే సమయంలో బ్రాడ్ కన్నీళ్లతో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ సిరీసులో బ్రాడ్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇటీవలే తన కెరీర్లో 600 టెస్టు వికెట్లు తీసుకున్న అతను.. ఈ జాబితాలో చేరిన రెండో పేసర్గా నిలిచాడు. అంతకుముందు జేమ్స్ ఆండర్సన్ మాత్రమే ఈ జాబితాలో ఉన్న మరో పేసర్.

ఇలా రిటైర్ అవ్వాలనే నిర్ణయం గురించి మాట్లాడిన బ్రాడ్.. దీని గురించి చాలా కాలంగా ఆలోచిస్తూనే ఉన్నట్లు చెప్పాడు. అలాగే ఆసీస్తో ఆడటం తనకు ఎంతో ఇష్టమని, అందుకే తన కెరీర్కు వీడ్కోలు చెప్పడానికి ఇదే సరైన సమయం అని అనుకున్నాడట. క్రికెట్లో యాషెస్ సిరీసుకు ప్రత్యేక స్థానం ఉన్న సంగతి తెలిసిందే.
'దీని గురించి కొంత కాలంగా ఆలోచిస్తూనే ఉన్నా. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగే మ్యాచులు నా దృష్టిలో ఎప్పుడూ అత్యుత్తమమే. ఆసీస్తో తలపడటం నాకు చాలా ఇష్టం. యాషెస్తో నాకు లవ్ ఎఫైర్ ఉంది. నా చివరి బౌలింగ్, బ్యాటింగ్ ప్రదర్శన ఈ సిరీసులోనే చేయాలని అనుకున్నా' అని బ్రాడ్ తెలిపాడు.
'ఈ విషయాన్ని రాత్రే స్టోక్స్కు చెప్పా. ఇక డ్రెస్సింగ్ రూంలో ఈ రోజు ఉదయమే అందరికీ చెప్పా. ఇదే కరెక్ట్ టైం అనిపించింది. ఆ తర్వాత జరిగే దృశ్యాలు నా ఫ్రెండ్స్, నాటింగ్హాంషైర్ టీంమేట్స్కు చూడటం నాకిష్టం లేదు. అందుకే ఇప్పుడే ఇది చెప్పేశా. నా చివరి ఆసీస్ ఇన్నింగ్స్లో రాణించాలని అనుకుంటున్నా' అని బ్రాడ్ పేర్కొన్నాడు.