యాషెస్ సిరీసు ప్రస్తుతం చాలా హీటెక్కింది. ఎంతలా అంటే.. లార్డ్స్లో జరిగిన రెండో టెస్టులో ఆసీస్ ప్లేయర్లతో ఏకంగా మేరీలెబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) సభ్యులే గొడవకు దిగేంతలా. ఈ మ్యాచ్ చివరి రోజున జానీ బెయిర్స్టోను అలెక్స్ క్యారీ స్టంప్ అవుట్ చేశాడు. అయితే అది క్రీడాస్ఫూర్తికి విరుద్ధం అంటూ ఇంగ్లిష్ మీడియా తెగ గొడవ చేస్తోంది.
ఈ క్రమంలోనే లార్డ్స్ మైదానంలోని లాంగ్ రూంలో ఎంసీసీ సభ్యులు కూడా ఆసీస్ ప్లేయర్లతో గొడవకు దిగారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ఉస్మాన్ ఖవాజా, డేవిడ్ వార్నర్ చేతులు పట్టుకొని ఎంసీసీ సభ్యులు లాగడం కూడా వీడియోలో కనిపించింది. దీన్ని సీరియస్గా తీసుకున్న ఎంసీసీ.. ముగ్గురు సభ్యులను సస్పెండ్ చేసింది.

ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు కూడా తెలిపింది. ఈ క్రమంలో అసలు ఆ రూంలో ఏం జరిగిందో ఒక సభ్యుడు వెల్లడించాడు. ఆసీస్ టీం అటువైపు రాగానే గదిలో ఉన్న కొందరు ఇంగ్లండ్ అభిమానులు.. 'సాండ్ పేపర్', 'చీట్' అంటూ నినాదాలు చేసినట్లు సదరు వ్యక్తి వెల్లడించాడు. 'చీఫ్ ఎగ్జిక్యూటివ్కు మిలటరీ అనుభవం ఉంది. అయినా ఇలాంటి ఘటన జరగకుండా ఆపలేకపోవడం చూసి ఆశ్చర్యపోయా' అని ఆ సభ్యుడు తెలియజేశారు.
మ్యాచ్ గెలిచిన తర్వాత ఆసీస్ ప్లేయర్లు అటుగా రాగానే లాంగ్ రూంలోని ఇంగ్లండ్ ఫ్యాన్స్ గొడవ చేశారని, 'చీట్.. చీట్' అంటూ తిట్టారని వెల్లడించారు. ఆ వెంటనే మరొకవైపు నుంచి 'సాండ్ పేపర్' అంటూ నినాదాలు మొదలయ్యాయట. 'ఇలా జరుగుతుందేమో అని అధికారులు ముందే ఊహించాల్సింది. అప్పుడే లాంగ్ రూంలోకి వెళ్లి.. మీకు ఈ అవుట్ నచ్చకపోయి ఉండొచ్చు. కానీ ఆటగాళ్లు వచ్చినప్పుడు మర్యాదగా ప్రవర్తించండని చెప్పుండాల్సింది' అని ఆ సభ్యుడు పేర్కొన్నాడు.
ఈ గొడవలో విదేశాల నుంచి వచ్చిన విజిటింగ్ టీం ప్లేయర్లతో గొడవ పడినందుకు ఎంసీసీ సభ్యులు తమ మెంబర్షిప్ కోల్పోయే ప్రమాదం ఉంటుందని ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా హెచ్చరించాడు. ముఖ్యంగా ఉస్మాన్ ఖవాజాతో గొడవ పడటంపై ఆసీస్ మాజీ దిగ్గజాలు కూడా మండిపడుతున్నారు. ఖవాజా ఎవరితోనూ గొడవకు దిగడని, అలాంటి వాడితో గొడవ పడటం కరెక్ట్ కాదని అంటున్నారు.