ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో యాషెస్ టెస్టులో ఆసీస్ జట్టు తడబడుతోంది. టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్కు బంతితో మంచి ఆరంభమే లభించింది. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో డేవిడ్ వార్నర్ (4) ఎక్కువ సేపు క్రీజులో నిలవకుండానే పెవిలియన్ చేరాడు. ఇక మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (13)ను మార్క్ వుడ్ క్లీన్ బౌల్డ్ చేశాడు.
ఇలాంటి సమయంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను తీసుకున్న మార్నస్ లబుషేన్ (21).. క్రిస్ వోక్స్ బౌలింగ్లో రూట్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే స్టువర్ట్ బ్రాడ్ వేసిన బంతిని డిఫెండ్ చేసుకునేందుకు స్మిత్ ప్రయత్నించాడు. అయితే ఆ బంతి.. బ్యాటుకు, ప్యాడ్కు మధ్య నుంచి కీపర్ బెయిర్స్టో వైపు వెళ్లింది. దాన్ని అతను అందుకొని అప్పీల్ చేశాడు.

ఈ ఘటన 25వ ఓవర్లో జరిగింది. ఇంగ్లండ్ అప్పీల్ విన్న అంపైర్ అవుట్ ఇచ్చాడు. అయితే బంతి తన బ్యాటుకు తగల్లేదని స్మిత్ భావించాడు. దీంతో రివ్యూ కోరాడు. రిప్లేలో బ్యాటును బంతి తాకినట్లు తేలింది. దీంతో స్మిత్ నిరాశగా పెవిలియన్ చేరాడు. అయితే ఇంగ్లండ్ అభిమానులు మాత్రం దీన్ని తేలిగ్గా తీసుకోలేదు.
ఇన్సైడ్ ఎడ్జ్ ఉన్నట్లు క్లియర్గా కనిపిస్తున్నా స్మిత్ రివ్యూ తీసుకున్నాడని ఎద్దేవా చేశారు. అతనొక చీటర్ అంటూ తిట్టిపోశారు. అతను పెవిలియన్ వెళ్లే సమయంలో స్టేడియం అంతా కలిసి అతన్ని 'బూ..' అంటూ ఎగతాళి చేశారు. 'ఎంత కాన్ఫిడెంట్గా చీటింగ్ చేస్తున్నాడో' అంటూ స్మిత్ను నెటిజన్లు విమర్శిస్తున్నారు.
రెండో టెస్టులో బెయిర్స్టోను స్టంప్ అవుట్ చేసినప్పటి నుంచి ఆసీస్ను చీటర్లు అంటూ ఇంగ్లండ్ ఫ్యాన్స్ విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. చివరకు ఆ దేశ ప్రధాని కూడా బెయిర్స్టో అవుట్పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇక ఫ్యాన్స్ అయితే తెగ గొడవ చేసి, లాంగ్ రూంలో ఆసీస్ ప్లేయర్లతో గొడవకు దిగిన సంగతి తెలిసిందే.