ఇంగ్లండ్ అన్నంత పనీ చేసింది. చివరి యాషెస్ టెస్టులో గెలుస్తామని చెప్పిన ఆ టీం ఘనవిజయం సాధించింది. తమ స్టార్ ప్లేయర్ స్టువర్ట్ బ్రాడ్కు విజయంతో ఘనమైన వీడ్కోలు ఇచ్చింది. ఓవల్ వేదికగా జరిగిన చివరి టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్సులో 283 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
బదులుగా ఆసీస్ తమ మొదటి ఇన్నింగ్సులో 295 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం రెండోసారి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ రెచ్చిపోయింది. ధనాధన్ ఆటతో 395 పరుగులు చేసింది. దీంతో ఆసీస్ ముందు 384 పరుగుల లక్ష్యం నిలిచింది. ఈ ఛేజ్ను ఆసీస్ మెరుగ్గానే ఆరంభించింది.

మూడో రోజు ఆట ముగిసే సమయానికి డేవిడ్ వార్నర్ (60), ఉస్మాన్ ఖవాజా (72) మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. కానీ నాలుగో రోజు ఆట మొదలైన కాసేపటికే క్రిస్ వోక్స్ వీళ్లిద్దర్నీ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత వచ్చిన స్టార ప్లేయర్ లబుషేన్ (13) పెద్దగా రాణించలేదు. ఇలాంటి సమయంలో స్టీవ్ స్మిత్ (54), ట్రావిస్ హెడ్ (43) ఆకట్టుకున్నారు.
వీళ్లిద్దరూ క్రీజులో ఉంటే ఆసీస్కు విజయం గ్యారంటీ అని అంతా అనుకున్నారు. దానికితోడు స్మిత్ ఇచ్చిన క్యాచ్ను స్లిప్స్లో స్టోక్స్ వదిలేయడంతో ఇంగ్లండ్ ఓటమి ఖాయమని అంతా అనుకున్నారు. అయితే అనూహ్యంగా పుంజుకున్న ఇంగ్లండ్ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీసుకున్నారు.
దీంతో మిచెల్ మార్ష్ (6) విఫలమయ్యాడు. చివర్లో అలెక్స్ క్యారీ (28) కొంత పోరాడాడు. కానీ అతనికి మిచెల్ స్టార్క్ (0), ప్యాట్ కమిన్స్ (9), టాడ్ మర్ఫీ (18), జోష్ హాజిల్వుడ్ (4 నాటౌట్) సహకారం అందించలేకపోయారు. ముఖ్యంగా చివర్లో రిటైర్ అవుతున్న లెజెండ్ స్టువర్ట్ బ్రాడ్.. మర్ఫీ, క్యారీని పెవిలియన్ చేర్చడంతో ఆసీస్ కథ ముగిసింది.
ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ 49 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో యాషెస్ సిరీస్ 2-2తో సమం అయింది. తొలి రెండు టెస్టుల్లో అద్భుతంగా ఆడి విజయం సాధించిన ఆసీస్.. ఆ తర్వాత మూడు మ్యాచుల్లోనూ తడబడింది. నాలుగో టెస్టులో కూడా ఆసీస్ ఓడిపోయేదే.. కానీ వర్షం కారణంగా ఆ మ్యాచ్ రద్దయింది.
ఇక ఈ సిరీసు ఆసాంతం రాణించిన మిచెల్ స్టార్క్కు 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు దక్కింది. చివరి టెస్టులో అద్భుతంగా రాణించిన క్రిస్ వోక్స్కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. మ్యాచ్ ముగిసిన వెంటనే ఇంగ్లండ్ ప్లేయర్లు అందరూ రిటైర్ అవుతున్న బ్రాడ్ను కౌగిలించుకొని వీడ్కోలు పలికడం గమనార్హం.