యాషెస్ రెండో టెస్టు తర్వాత ఈ సిరీస్లో వేడి పెరిగింది. ముఖ్యంగా బెయిర్స్టో స్టంపౌట్ తర్వాత రెండు జట్ల మధ్య వైరం మరో స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో మూడో టెస్టులో మరింత ఎదురు దాడి చేస్తామని, ఎలాగైనా ఆసీస్ను చిత్తు చేస్తామని ఇంగ్లండ్ టీం అంటోంది. ఈ సిరీస్ను తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. అదే సమయంలో ఆసీస్ కూడా తమ ఆధిక్యాన్ని కొనసాగిస్తామని అంటోంది.
హెడింగ్లే వేదికగా జరిగే టెస్టు.. ఆసీస్ స్టార్ స్టీవ్ స్మిత్ కెరీర్లో 100వ టెస్టు. ఈ మ్యాచ్ గెలిచేసి, సిరీస్ను తమ ఖాతాలో వేసుకోవాలని ఆసీస్ అనుకుంటోంది. అది జరిగితే తాను చాలా సంతోషిస్తానని, ఈ మ్యాచ్ కూడా గెలిచేందుకే ప్రయత్నిస్తానని స్మిత్ కూడా అన్నాడు. ఇలాంటి సమయంలో ఈ సిరిస్లో ఇంగ్లండ్ కూడా గెలిచే అవకాశం ఉందని టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చెప్పాడు.

అదే సమయంలో ఇంగ్లండ్ కనుక తమ బాజ్బాల్ ఆటతీరును మార్చుకుంటే ఏం చెప్పలేమన్న అశ్విన్.. వాళ్లు కనుక ఈ విధానం మార్చుకోకుండా, మూడో టెస్టులో కూడా బాజ్బాల్ స్టైల్లోనే ఆడితే ఆ టీంపై తనకు గౌరవం పెరుగుతుందని చెప్పాడు. 'యాషెస్లో రెండు ఓటముల తర్వాత కూడా ఇంగ్లండ్ మారకుండా బాజ్బాల్ ఆడితే.. నాకు వాళ్లపై గౌరవం రెట్టింపు అవుతుంది' అని అశ్విన్ వెల్లడించాడు.
'బాజ్బాల్ వాళ్లు ఆడే క్రికెట్. అందుకని అన్ని మ్యాచులు గెలవలేం కదా. కొన్ని గెలుస్తాం, కొన్ని ఓడిపోతాం. ఇలా ఓడినా అదే అప్రోచ్ కనుక చూపిస్తే వాళ్లకే నా మద్దతు ఉంటుంది' అని స్పష్టం చేశాడీ వెటరన్ ఆఫ్స్పిన్నర్. ఈ సిరీస్లో ఆస్ట్రేలియానే ఫేవరెట్ అని, అయితే ఇంగ్లండ్ కూడా ధాటిగా ఆడి గెలిచే అవకాశం ఉందని అశ్విన్ చెప్పాడు. 'ఇంగ్లండ్ కూడా గెలిచే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ సిరీస్లో లియాన్ ఇక ఆడటం లేదు కదా' అన్నాడు.