యాషెస్ సిరీసులో ఇంగ్లండ్ తొలి విజయం సాధించింది. హెడింగ్లే వేదికగా జరిగిన మ్యాచ్లో మూడు వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో ఆస్ట్రేలియా ఆధిక్యం 2-1కి తగ్గింది. ఇదే జోరు కొనసాగించి నాలుగో టెస్టులో కూడా గెలవాలని ఇంగ్లండ్ అనుకుంటోంది. మూడో టెస్టు విజయంతో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అరుదైన రికార్డు సాధించాడు. ఈ క్రమంలో టీమిండియా లెజెండ్ ఎంఎస్ ధోనీ రికార్డును బద్దలు కొట్టాడు.
హెడింగ్లే టెస్టులో ఇంగ్లండ్ 251 పరుగుల టార్గెట్ను కేవలం 50 ఓవర్లలోనే ఛేజ్ చేసింది. దీంతో అత్యధిక సార్లు 250+ స్కోర్లను ఛేజ్ చేసిన జట్టు కెప్టెన్గా బెన్ స్టోక్స్ రికార్డు సృష్టించాడు. స్టోక్స్ కెప్టెన్సీలో ఇలా 250+ స్కోరును ఛేజ్ చేయడం ఇంగ్లండ్కు ఇది ఐదోసారి కావడం గమనార్హం. ఇంతకుముందు ఈ రికార్డు ఎంఎస్ ధోనీ పేరిట ఉండేది. ధోనీ హయాంలో భారత జట్టు నాలుగు సార్లు 250+ పరుగుల టార్గెట్ను ఛేజ్ చేసింది.

ఇక మ్యాచ్ విషయానికొస్తే ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ ఐదు వికెట్లతో చెలరేగాడు. ఒకానొక సమయంలో ఇంగ్లండ్ ఈ మ్యాచ్ గెలవడం అసాధ్యంగా కనిపించింది. అయితే యువ ప్లేయర్ హ్యారీ బ్రూక్ (75) అరుదైన ఇన్నింగ్స్ ఆడాడు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేసిన అతను.. ఈ క్రమంలో అత్యంత తక్కువ బంతుల్లో 1000 టెస్టు పరుగులు పూర్తి చేసిన బ్యాటర్గా కూడా రికార్డు సృష్టించాడు.
అతనితోపాటు క్రిస్ వోక్స్ (32 నాటౌట్) కూడా రాణించాడు. ఇక మార్క్వుడ్ కేవలం 8 బంతుల్లోనే 16 పరుగులతో అజేయంగా నిలిచాడు. బంతితో కూడా అతను చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీసుకున్న అతను.. రెండో ఇన్నింగ్స్లో రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు. దీంతో అతనికే 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.