యాషెస్ చివరి టెస్టులో ఇంగ్లండ్ గెలిచినా కూడా.. కీలక సమయంలో బంతి మార్చడానికి అంపైర్లు అంగీకరించడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. దీనిపై పలువురు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆసీస్ మాజీ లెజెండ్ రికీ పాంటింగ్ కూడా ఈ చ్యను తప్పుబట్టాడు. చివరి ఇన్నింగ్స్లో 384 పరుగుల ఛేజ్ను ఆసీస్ బాగానే మొదలు పెట్టింది.
ఓపెనర్లు ఇద్దరూ తొలి వికెట్కు 140 పరుగులు జోడించారు. దీంతో ఆసీస్ గెలవడం ఖాయమని అంతా అనుకున్నారు. ఐదో రోజు ఆట మొదలు పెట్టిన కాసేపటికి అంపైర్లు.. బంతిలో ఏదో లోపం ఉందని భావించారు. దీంతో బంతిని మార్చారు. ఆ తర్వాత కేవలం రెండు ఓవర్ల వ్యవధిలోనే ఓపెనర్లు ఇద్దరూ పెవిలియన్ చేరడం గమనార్హం. సాధారణంగా ఇలా బంతి మార్చడం అంపైర్ల నిర్ణయానికి లోబడి ఉంటుంది.

అయితే అప్పటికి ఎన్ని ఓవర్లు వేశారో చూసి.. అన్ని ఓవర్లు వేసిన బంతితోనే దాన్ని రిప్లేస్ చేస్తారు. కానీ పలువురు మాజీలు, ఆసీస్ మీడియా మాత్రం యాషెస్ ఐదో టెస్టులో అది జరగలేదని అంటున్నారు. చివరి టెస్టు ఐదో రోజున మార్చిన బంతి చాలా కొత్తదని, అన్ని ఓవర్లు వేసిన బంతి కాదని ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా నెట్టింట ప్రత్యక్షం అయ్యాయి.
సడెన్గా బంతి స్వింగ్ అవడం మొదలవడంతో ఆసీస్ బ్యాటర్లు తడబడ్డారు. దీనిపై ఆసీస్ మాజీ దిగ్గజం రికీ పాంటింగ్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశాడు. ఈ మ్యాచ్ను బంతి మార్చడమే మలుపు తిప్పిందని అభిప్రాయపడ్డాడు. 'ఈ మ్యాచ్లో మార్చిన బంతి కండిషన్ నా వరకు అనుమానాస్పదంగా ఉంది. ఆ బంతి అంత పాతదిలా లేదు' అన్నాడు.
'అక్కడ ఉన్న ఆ రెండు బంతులను చూసి.. రెండు ఒకేలా ఉన్నాయని చెప్పే పరిస్థితి లేదు. ఆ మాట ఎవరూ చెప్పలేరు కూడా. ఈ గేమ్ను మలుపు తిప్పిన క్షణం అదే. ఓవరాల్గా ఈ టెస్టులో కూడా అదే కీలకం. ఈ విషయంలో దర్యాప్తు అవసరం అని అనుకుంటున్నా. బౌలర్లకు కొత్తగా తీసుకున్న బంతి ఇచ్చిన సహకారం.. పాత బంతి ఎలాంటి పరిస్థితిలో ఇవ్వదని నేను నమ్మకంగా చెప్తున్నా' అని పాంటింగ్ పేర్కొన్నాడు.