యాషెస్ రెండో టెస్టులో ఇంగ్లండ్ స్టార్ జానీ బెయిర్స్టో అవుటైన విధానంపై పెద్ద చర్చ జరుగుతోంది. ఆసీస్ ఈ విషయంలో చీటింగ్ చేసిందని, బెయిర్స్టో నాటౌట్ అని చాలా మంది అంటున్నారు. ఆసీస్ దిగ్గజం బ్రాడ్ హాగ్ కూడా కంగారూలు చేసిన పని అంత గొప్పగా లేదని విమర్శించాడు. ఇలాంటి విషయంపై టీమిండియా వెటరన్ రవిచంద్రన్ అశ్విన్ పెదవి విప్పాడు.
క్రికెట్లో మన్కడింగ్ను చట్టబద్ధం చేయడంలో అశ్విన్ పాత్ర చాలా ఉందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బెయిర్స్టో అవుట్పై అశ్విన్ స్పందన ఎలా ఉంటుందని చాలా మంది ఎదురు చూశారు. ఇలా అతన్ని అవుట్ చేయగానే ఇంగ్లండ్ ఫ్యాన్స్ అందరూ ఆసీస్ టీంను తిట్టిపోశారు. 'అదే ఆసీస్ టీం.. ఎప్పుడూ చీటింగ్ చేస్తుంది' అంటూ స్టేడియం దద్దరిల్లేలా నినాదాలు చేశారు.

ఈ అవుట్తో క్రికెట్ ప్రపంచంలో మరోసారి 'క్రీడాస్ఫూర్తి' (స్పిరిట్ ఆఫ్ ది క్రికెట్) చర్చ పెద్ద ఎత్తున మొదలైంది ఈ నేపథ్యంలో ఈ అవుట్ గురించి అశ్విన్ క్లారిటీ ఇచ్చాడు. 'ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. ఒక కీపర్ అంత దూరం నుంచి వికెట్ల మీదకు బంతిని ఊరికినే విసరడు. బ్యాటర్ కనుక బెయిర్స్టోలా క్రీజు వదిలేస్తుండటం గమనిస్తేనే అలా చేస్తాడు' అని అశ్విన్ తేల్చిచెప్పాడు.
'ఇది తప్పు, క్రీడాస్ఫూర్తికి విరుద్ధం అంటూ గొడవ చేయడం కన్నా.. అలా చేసిన ఆటగాళ్ల తెలివిని మెచ్చుకోవాలి' అని అశ్విన్ చెప్పాడు. ఇలా అశ్విన్ ఇచ్చిన వివరణను చాలా మంది అభిమానులు పాజిటివ్గా తీసుకున్నారు. ఒక యూజర్ అయితే.. ఈ ట్వీట్ కోసమే ఎదురు చూస్తున్నామని అన్నాడు. మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేశాడు. క్రికెట్ నిబంధనల్లో ఉన్నది ఏదీ, క్రీడాస్ఫూర్తికి విరుద్ధం కాదని స్పష్టం చేశాడు.