
హైదరాబాద్: ఐదు టెస్టుల యాషెస్ సిరిస్లో ఇంగ్లాండ్ శుభారంభం చేసింది. బర్మింగ్హామ్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్టులో 251 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.
ఆస్ట్రేలియా నిర్దేశించిన 398 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 52.3 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ బౌలర్లలో నాథన్ లైయాన్ ఆరు వికెట్లు తీయగా.. ప్యాట్ కమ్మిన్స్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. ఇంగ్లాండ్ జట్టులో క్రిస్ వోక్స్ 38 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. జేసన్ రాయ్(28), జోయ్ రూట్(28), బర్న్(11), డెన్లీ(11) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు.
స్టువర్ట్ బ్రాడ్ డకౌట్ కాగా, మిగతా ఆటగాళ్లు నిరాశపరిచారు. గురువారం ప్రారంభమైన ఈ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్లో 284 పరుగులకు ఆలౌట్ అవగా, రెండో ఇన్నింగ్స్ను 112 ఓవర్లలో 487/7 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఇక, ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 374 పరుగులకు ఆలౌటైంది.
తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్ల్లోనూ రెండు సెంచరీలతో ఆకట్టుకున్న ఆస్ట్రేలియా ఆటగాడు స్టీన్ స్మిత్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇదిలా ఉంటే, యాషెస్ సిరీస్లో రెండో టెస్టు ఆగస్టు 14 నుంచి లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరగనుంది.