
శాండ్పేపర్ చూపిస్తూ:
గత నెలలో ముగిసిన వన్డే ప్రపంచకప్లో వార్నర్, స్మిత్ను ఓ ఆటాడుకున్న ఇంగ్లండ్ అభిమానులు ఇప్పుడు యాషెస్లోనూ తమ ప్రతాపం చూపించారు. గురువారం తొలి టెస్ట్ మ్యాచ్ ఆరంభానికి ముందు జాతీయ గీతాలాపన కోసం ఆసీస్ ఆటగాళ్లు వస్తుండగా.. ట్యాంపరింగ్ కోసం వాడిన శాండ్పేపర్ చూపిస్తూ ఇంగ్లండ్ ప్రేక్షకులు హేళన చేశారు.

మోసగాళ్లు.. మోసగాళ్లు:
టాస్ గెలవడంతో వార్నర్ (2), బాన్క్రాఫ్ట్ (8) ఓపెనర్లుగా బరిలోకి వెళుతున్నప్పుడు ఇంగ్లిష్ అభిమానులు 'మోసగాళ్లు.. మోసగాళ్లు' అంటూ నినాదాలు చేశారు. ఇక ఇద్దరినీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ తక్కువ స్కోర్లకే పెవిలియన్కు చేర్చినప్పుడు కూడా ఇంగ్లిష్ అభిమానులు శాండ్ పేపర్ చూపిస్తూ పెవిలియన్కు సాగనంపారు. మరోవైపు స్టేడియంలో ఓ అభిమాని అయితే 'ఇంగ్లండ్ చాంప్స్.. ఆసీస్ ఛీట్స్' అనే ప్లకార్డు పట్టుకుని నినాదానాలు చేసాడు.

ఏడాది నిషేధం:
2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్లో సాండ్ పేపర్తో బాన్క్రాఫ్ట్ బంతిని రుద్దడం, ఇది వీడియోలో రికార్డు అవ్వడం జరిగిపోయింది. ఈ ఘటనలో కెప్టెన్ స్టీవ్ స్మిత్, వార్నర్ల పాత్ర ఉండడంతో క్రికెట్ ఆస్ట్రేలియా ముగ్గురిపై ఏడాది నిషేధం విధించింది. నిషేధం అనంతరం స్మిత్, వార్నర్లు ఐపీఎల్, ప్రపంచకప్లలో ఆడాడు. ఇప్పుడు యాషెస్ సిరీస్ ఆడుతున్నారు.

స్మిత్ షో:
బౌలర్ల దూకుడు, బ్యాట్స్మెన్ పోరాటం మధ్య యాషెస్ సిరీస్ ఆసక్తిగా ప్రారంభమైంది. ఇంగ్లండ్ పేసర్లు విజృంభించడంతో 122 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన దశలో మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (219 బంతుల్లో 144; 16 ఫోర్లు, 2 సిక్స్లు) ఒంటరి పోరాటం చేయడంతో.. ఆస్ట్రేలియా 284 పరుగులు చేసింది. స్టువర్ట్ బ్రాడ్ (5/86), క్రిస్ వోక్స్ (3/58)లు చెలరేగారు. ఆట ముగిసే సరికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 2 ఓవర్లలో వికెట్లేమీ కోల్పోకుండా 10 పరుగులు చేసింది. బర్న్స్ (4), జేసన్ రాయ్ (6) క్రీజులో ఉన్నారు.

పేర్లు, నంబర్లతో:
వన్డే, టీ20 తరహాలోనే టెస్టు ఫార్మాట్లోనూ ఆటగాళ్లు సరికొత్త జెర్సీలో కనిపించారు. యాషెస్ తొలి టెస్టులో భాగంగా ఇంగ్లండ్, ఆసీస్ ఆటగాళ్లు జెర్సీల వెనకాల తమ పేర్లు, నంబర్లతో బరిలోకి దిగారు. టెస్టు ఫార్మాట్ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ఐసీసీ ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications












