
ఎడ్జ్బాస్టన్: ఇంగ్లాండ్ స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్ మైదానం వీడుతూ క్షమాపణలు చెప్పాడని సహచర బౌలర్ స్టువార్ట్ బ్రాడ్ తెలిపాడు. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ గురువారం ప్రారంభమైంది. బర్మింగ్హామ్ వేదికగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ రసవత్తరంగా సాగింది. అటు ఇంగ్లండ్ బౌలర్ల ప్రతాపం.. ఇటు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ పోరాటం మధ్య ఇన్నింగ్స్ ఆసక్తిగా సాగింది.
తొలి ఇన్నింగ్స్లో జేమ్స్ అండర్సన్ బౌలింగ్ చేస్తుండగా.. కుడికాలి కండరం పట్టేయడంతో మైదానాన్ని వీడాడు. అండర్సన్ కేవలం నాలుగు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసాడు. అతడు మైదానం వీడుతూ బ్రాడ్ దగ్గరకు వచ్చి వెళ్ళాడు. మ్యాచ్ అనంతరం బ్రాడ్ మాట్లాడుతూ... 'ఆ సమయంల్లో జిమ్మీ అసహనం వ్యక్తం చేసాడు. బౌలర్లకు శ్రమ కలిగిస్తున్నందుకు మా వద్దకు వచ్చి క్షమాపణలు చెప్పాడు. జిమ్మీ అలా చెప్పాల్సిన అవసరమే లేదు. అయినా మాకు క్షమాపణలు చెప్పాడు' అని బ్రాడ్ పేర్కొన్నాడు.
జులై 2న కౌంటీ క్రికెట్ ఆడేటప్పుడు జిమ్మీ కుడి కాలి కండరానికి గాయమైంది. ఈ నేపథ్యంలోనే కొన్ని వారాల పాటు కౌంటీ క్రికెట్కు దూరమయ్యాడు. మొదటి టెస్టుకు ముందే జిమ్మీ కోలుకున్నాడని ఇంగ్లాండ్ యాజమాన్యం భావించింది. పూర్తి ఫిట్నెస్ లేకుండా యాషెస్ సిరీస్ తొలి టెస్టులో ఆడేందుకు సిద్ధపడి.. గాయం తిరగబెట్టడంతో మైదానాన్ని వీడాడు. జిమ్మీకి గాయం తీవ్రత అధికంగా ఉంటే.. సిరీస్ మొత్తానికి దూరమయ్యే అవకాశం ఉంది.
మ్యాచ్లో ఇంగ్లాండ్ స్టార్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అరుదైన రికార్డు అందుకున్నాడు. యాషెస్లో 100 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 100 వికెట్ల మైలురాయిని చేరుకున్న 19వ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్. స్టీవ్ స్మిత్ వికెట్ తీయడంతో బ్రాడ్ ఈ ఘనతను సాధించాడు. ఆస్ట్రేలియాపై తొలి ఇన్నింగ్స్లో 86 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీసాడు. డేవిడ్ వార్నర్, కామెరాన్ బాన్క్రాఫ్ట్, స్టీవ్ స్మిత్, టిమ్ పైన్, జేమ్స్ ప్యాటిన్సన్లను పెవిలియన్ చేరాడు. ఆస్ట్రేలియా మాజీ స్పిన్ బౌలర్ షేన్ వార్న్ అత్యధిక యాషెస్ వికెట్లు (195) సాధించాడు. ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ 104 వికెట్లు తీసాడు.