
హైదరాబాద్: తొలిసారి వన్డే వరల్డ్కప్ను గెలిచిన ఉత్సాహంతో యాషెస్ టెస్టు సిరిస్ ఆడుతోన్న ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుకు ఊహించని షాక్లు తగులుతున్నాయి. ఆగస్టు 14 నుంచి లార్డ్స్ వేదికగా ఆరంభం కానున్న రెండో టెస్టుకు ఇప్పటికే ఆ జట్టు ప్రధాన పేసర్ జేమ్స్ ఆండర్సన్ దూరం కాగా... తాజాగా మరో పేస్ బౌలర్ ఒల్లీ స్టోన్ గాయపడ్డాడు.
వార్విక్షైర్కు చెందిన ఒల్లీ స్టోన్ బుధవారం నెట్ ప్రాక్టీస్లో గాయపడ్డాడు. దీంతో ఒల్లీ స్టోన్కు వైద్య పరీక్షలు నిర్వహించగా తీవ్రమైన వెన్నునొప్పితో అతడు బాధపడుతున్నాడని.. అతడికి రెండు వారాల విశ్రాంతి కావాలని వైద్యులు సూచించారు. దీంతో రెండో టెస్టుకు ఒల్లీ స్టోన్ కూడా దూరమయ్యాడని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.
25 ఏళ్ల ఒల్లీ స్టోన్ యాషెస్ టెస్టు సిరిస్కు ముందు లార్డ్స్ వేదికగా ఐర్లాండ్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో అరంగేట్రం చేశాడు. మూడు వికెట్లతో రాణించాడు. దీంతో అతడిని ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్కు ఇంగ్లండ్ సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇదిలా ఉంటే, ఎడ్జిబాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ 251 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే.
కాగా, తొలి టెస్టులో ఆండర్సన్ నాలుగు ఓవర్లు వేసిన తర్వాత కాలిపిక్క కండరాలు పట్టేయడంతో అండర్సన్ మైదానాన్ని వీడాడు. అండర్సన్ గాయం నుంచి కోలుకోవడానికి మరో రెండు వారాల సమయం పట్టనుంది. ప్రస్తుతం జేమ్స్ అండర్సన్ జట్టు పునరావస శిబిరంలో చికిత్స తీసుకుంటున్నాడు. దీంతో రెండో టెస్టు ఆండర్సన్ అందుబాటులో ఉండటం లేదని ఈసీబీ స్పష్టం చేసింది.
వీరిద్దరూ లార్డ్స్ వేదికగా జరగనున్న రెండో టెస్టుకు దూరం కావడంతో ఇంగ్లాండ్ బౌలింగ్ మరింత బలహీనపడుతుంది. మరోవైపు రెండో టెస్టులో జేమ్స్ అండర్సన్ స్థానంలో యువ పేసర్ జోఫ్రా ఆర్చర్కు చోటు దక్కే అవకాశం ఉంది. ఇదే గనుక జరిగితే ప్రతిష్టాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జోప్రా ఆర్చర్ టెస్టు అరంగేట్రం చేయనున్నాడు.