
హైదరాబాద్: గబ్బా స్టేడియం వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ సెంచరీతో చెలరేగాడు. ఓవర్ నైట్ స్కోరు 165/4తో మూడో రోజు ఆట ప్రారంభించిన కొద్ది సేపటికే షాన్ మార్ష్(51) పరుగుల వద్ద స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో ఆండర్సన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు.
మరోవైపు ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి ఆసీస్ బ్యాట్స్మెన్ వరుసగా పెవిలియన్కు చేరుతున్నప్పటికీ, మరో ఎండ్లో ఉన్న స్మిత్ తడబడకుండా క్రీజులో నిలకడగా ఆడుతున్నాడు. ఈ క్రమంలో స్టీవ్ స్మిత్ సెంచరీని నమోదు చేశాడు. 261 బంతులాడిన స్మిత్ తన టెస్టు కెరీర్లో 21వ సెంచరీని సాధించాడు.
సెంచరీ అనంతరం స్మిత్ తన హెల్మెట్ తీసి డ్రెస్సింగ్ రూమ్ వైపు చూస్తూ.. ఛాతి పైభాగంలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు లోగోపై బలంగా తాకుతూ తనదైన శైలిలో విజయ గర్వం ప్రదర్శించాడు. దీంతో మైదానంలో ఉన్న అభిమానుల కేరింతలతో స్టేడియాన్ని హోరెత్తించారు. స్మిత్ ప్రదర్శనపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్లో 130.3 ఓవర్లకు గాను 328 పరుగులు చేసిన ఆలౌటైంది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ 141 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. దీంతో గబ్బా టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్పై 26 పరుగుల ఆధిక్యం లభించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్లో 302 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.
ఆసీస్ బ్యాట్స్మెన్లలో ఉస్మాన్ ఖవాజా 11, డేవిడ్ వార్నర్ 26, పీటర్ హ్యాండ్స్ కోంబ్ 14, షాన్ మార్ష్ 51, టిమ్ పైనీ 13, మిచెల్ స్టార్క్ 6, పాట్ కుమ్మిన్స్ 42, జోష్ హాజెల్ఉడ్ 6, నాథన్ లియోన్ 9 పరుగులు చేసిన ఔటయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో స్టువర్ట్ బ్రాడ్ 3, అలీ, జేమ్స్ ఆండర్సన్ చెరో 2 వికెట్లు తీసుకోగా... వోక్స్, జేక్ బాల్, రూట్ తలో వికెట్ తీసుకున్నారు.