
హైదరాబాద్: ఐదు టెస్టుల యాషెస్ సిరిస్లో భాగంగా మెల్ బోర్న్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో ఆసీస్ ఓపెనర్ ఓపెనర్ సెంచరీతో చెలరేగాడు. మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో మంగళవారం ప్రారంభమైన ఈ టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది.
ఓపెనర్లు డేవిడ్ వార్నర్, బాన్క్రాఫ్ట్ చక్కటి శుభారంభాన్నిచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్కు 122 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇన్నింగ్స్ 34.3 వద్ద వోక్స్ వేసిన బంతికి బాన్క్రాఫ్ట్(26) ఎల్బీగా పెవిలియన్కు చేరాడు. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ 103 (151 బంతుల్లో, 13 ఫోర్లు, ఒక సిక్సు) వద్ద ఆండర్సన్ బౌలింగ్లో బెయిర్ స్టోక్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

టెస్టుల్లో వార్నర్కి ఇది 21వ సెంచరీ కావడం విశేషం. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని డేవిడ్ వార్నర్ అధిగమించాడు. విరాట్ కోహ్లీ టెస్టుల్లో 20 సెంచరీలు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు వార్నర్ అంతర్జాతీయ క్రికెట్లో 6000 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.
ఆస్ట్రేలియా తరుపున ఈ ఘనత సాధించిన 14వ ఆటగాడిగా డేవిడ్ వార్నర్ నిలిచాడు. అంతేకాదు ఈ ఏడాది టెస్టుల్లో వార్నర్కి ఇది నాలుగో సెంచరీ కావడం విశేషం. అంతకముందు బంగ్లాదేశ్పై రెండు, పాకిస్థాన్పై ఒక సెంచరీని నమోదు చేశాడు. తాజాగా ఇంగ్లాండ్తో జరుగుతున్న యాషెస్ సిరిస్లో నాలుగో టెస్టు సెంచరీ చేశాడు.
తాజా టెస్టు సెంచరీతో టెస్టుల్లో 20కి పైగా సెంచరీలు సాధించిన ఆస్ట్రేలియా క్రికెటర్ల జాబితాలో డేవిడ్ వార్నర్ టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ 41 సెంచరీలతో ఈ జాబితాలో అగ్రస్ధానంలో ఉన్నాడు. కాగా, ఐదు టెస్టుల యాషెస్ సిరీస్ను ఆస్ట్రేలియా ఇప్పటికే 3-0తో కైవసం చేసుకుంది.