
హైదరాబాద్: యాషెస్ సిరీస్లో భాగంగా జరిగిన నాలుగో టెస్టులో పరవాలేదనిపించుకున్న ఇంగ్లాండ్ జట్టు ఐదో టెస్టులో పుంజుకోలేకపోతోంది. గురువారం మొదలైన చివరి టెస్టుకు ఇంగ్లాండ్ తడబడుతోంది.
మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 233/5తో నిలిచింది. కమిన్స్ (2/44), హాజిల్వుడ్ (2/47) విజృంభించడంతో ఇంగ్లాండ్ 95కే 3 వికెట్లు కోల్పోయింది. ఐతే ఆ తర్వాత రూట్ (83; 141 బంతుల్లో 8×4), మలన్ (55; 160 బంతుల్లో 5×4) నాలుగో వికెట్కు 133 పరుగులు జోడించడంతో కోలుకుంది.
ఓ దశలో 228/3తో రోజును సంతృప్తికరంగా ముగించేలా కనిపించింది. ఐతే రూట్, బెయిర్స్టో (5) వరుస ఓవర్లలో నిష్క్రమించడంతో తొలి రోజు ఆస్ట్రేలియాదే పైచేయి అయింది. కుక్ (39), స్టోన్మన్ (24), విన్స్ (25) ఆరంభాలను సద్వినియోగం చేసుకోలేకపోయారు.
సిరీస్ను ఇప్పటికే ఆస్ట్రేలియా 3-0తో సొంతం చేసుకుంది. గెలుపుపై పూర్తి ఆశలు కోల్పోయిన నేపథ్యంలో ఇంగ్లాండ్ ఇలా ఊరకుండిపోతుందేమో చూడాలి.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.