భారత దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించిన యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్కు మరోసారి నిరాశ ఎదురైంది. టెస్ట్ క్రికెట్ జట్టు నుంచి వైదొలిగిన తర్వాత ఇప్పుడు దక్షిణాఫ్రికా-ఏ జట్టుతో జరగనున్న రెండు నాలుగు రోజుల మ్యాచ్ల కోసం ప్రకటించిన ఇండియా-ఏ జట్టులో కూడా సర్ఫరాజ్ ఖాన్కు చోటు దక్కకపోవడం చర్చనీయాంశమైంది.
ప్రశ్నించిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
సర్ఫరాజ్ ఖాన్ను నిరంతరం నిర్లక్ష్యం చేయడంపై ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సెలక్టర్ల నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ ఆయన సోషల్ మీడియాలో (ఎక్స్ హ్యాండిల్లో) ఒక పోస్ట్ చేశారు.ఒవైసీ తన పోస్ట్లో "సర్ఫరాజ్ ఖాన్ను ఇండియా-ఎ జట్టుకు కూడా ఎందుకు ఎంపిక చేయలేదు?" అని ప్రశ్నించారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యద్భుతమైన గణాంకాలు ఉన్నప్పటికీ.. అతనికి అవకాశం ఇవ్వకపోవడంపై ఒవైసీ ప్రశ్నలు రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారితీశాయి.

సర్ఫరాజ్ ఖాన్ గణాంకాలు
ముంబైకి చెందిన కుడిచేతి వాటం బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అద్భుతమైన రికార్డును కలిగి ఉన్నాడు. సర్ఫరాజ్ ఫస్ట్ క్లాస్ సగటు 65 కంటే ఎక్కువగా ఉంది. టెస్ట్ క్రికెట్లో ఇప్పటివరకు 6 టెస్ట్ మ్యాచ్లు ఆడి 37 సగటుతో 371 పరుగులు చేశాడు. న్యూజిలాండ్పై బెంగళూరు టెస్టులో 150 పరుగులు కూడా చేశాడు. గతంలో ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టులో ఉన్నప్పటికీ అతనికి తుది జట్టులో అవకాశం దక్కలేదు. ఆ తర్వాత జట్టు నుంచి తప్పించారు. అయితే ఇంగ్లండ్-ఎ జట్టుతో జరిగిన ఒక మ్యాచ్లో అతను 92 పరుగులు చేశాడు. గాయం నుంచి కోలుకుని, తన ఫిట్నెస్ను మెరుగుపర్చుకుని, ఏకంగా 17 కిలోల బరువు కూడా తగ్గించుకున్నాడు.
సెలక్షన్ వెనుక అనిశ్చితి:
సర్ఫరాజ్ ఖాన్ను ఎంపిక చేయకపోవడంపై స్పష్టత లేకపోవడం అభిమానుల్లో, మాజీ క్రికెటర్లలో ఆగ్రహం కలిగిస్తోంది. సర్ఫరాజ్ ఖాన్ కేవలం రెడ్ బాల్ క్రికెట్ మాత్రమే ఆడుతున్నందున, దేశవాళీ క్రికెట్ లేదా ఇండియా-ఎ మ్యాచ్లు ఆడటం అతనికి చాలా కీలకం. దేశవాళీలో తిరిగి అడుగుపెట్టి, ఫిట్నెస్ నిరూపించుకున్నా కూడా ఇండియా-ఎ జట్టులో చోటు దక్కకపోవడం నిరాశ కలిగించే అంశం. దక్షిణాఫ్రికా-ఎతో జరిగే ఈ రెండు మ్యాచ్లకు గాయం నుంచి కోలుకున్న వికెట్ కీపర్, బ్యాటర్ రిషభ్ పంత్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. రెండో మ్యాచ్కు కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్ వంటి సీనియర్ ఆటగాళ్లు కూడా అందుబాటులో ఉండనున్నారు.
సర్ఫరాజ్ ఖాన్ నేడు, అక్టోబర్ 22న తన 28వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంలోనే అతనికి ఇండియా-ఎ జట్టులో స్థానం దక్కకపోవడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.