
ముంబై: కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్రీడాలోకం సంభించిపోయిన విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ సహా అన్ని క్రీడలు వాయిదా లేదా రద్దు చేయబడ్డాయి. ఈ క్రమంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ నిరవధిక వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం మార్చి 29న ప్రారంభంకావాల్సి ఐపీఎల్.. కరోనా వైరస్ కారణంగా తొలుత ఏప్రిల్ 15కి వాయిదా పడింది. ఆ తర్వాత దేశంలో లాక్డౌన్ని మరోసారి కొనసాగించడంతో ఐపీఎల్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయం తీసుకుంది.
ప్రమాదకర వైరస్ కారణంగా ఏర్పడిన ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. ఇపుడుడప్పుడే ఐపీఎల్ జరిగే సూచనలు కనిపించడం లేదు.ఒకవేళ షెడ్యూల్ మార్డుద్దామంటే.. ఈ ఏడాది ఆసియా కప్, టీ20 ప్రపంచకప్, ఆసీస్ పర్యటనలు ఉన్నాయి. ఇప్పటికే పీసీబీ ఆసియా కప్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్ 2020 సీజన్ జరగడం అనుమానమేనని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ ఈ ఏడాది ఐపీఎల్ రద్దయితే బీసీసీఐకి దాదాపు రూ. 4వేల కోట్లు నష్టం వాటిల్లుతుందని బోర్డు కోశాధికారి అరుణ్ ధుమాల్ వెల్లడించారు.
'ఒకవేళ ఈ ఏడాది ఐపీఎల్ రద్దయితే.. బీసీసీఐకి భారీ నష్టం వాటిళ్లుతుంది. నా అంచనా ప్రకారం దాదాపు రూ.4వేల కోట్ల ఆదాయం కోల్పోతుంది. ఈ మొత్తం ఎక్కువైనా కావొచ్చు. ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహించగలమో లేదో ప్రస్తుతానికైతే కచ్చితంగా చెప్పలేం. ఎప్పటికప్పుడు కరోనాపై అందరం మాట్లాడుకుంటున్నాం. ఈ సీజన్ జరగడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తాం' అని ధుమాల్ ఓ ప్రకటనలో చెప్పారు. ఒకవేళ ఐపీఎల్ జరుగకపోతే ప్రసారదారు స్టార్ ఇండియా కూడా భారీగా నష్టపోతుంది.
ఐపీఎల్ను ఖాళీ స్టేడియంలలో అయినా నిర్వహించాలనే వాదనలు ఇటీవలి కాలంలో బలంగా వినిపిస్తున్నాయి. పలువురు మాజీలు కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. అయితే ఐపీఎల్ నిర్వహించడానికి తాము సిద్ధమని శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) ఇప్పటికే బీసీసీఐకి ఆఫర్ చేసింది. తాజాగా యూఏఈకి ఇదే ఆఫర్ను బీసీసీఐ ముందు ఉంచింది. 'ఐపీఎల్ 2020 నిర్వహించేందుకు యూఏఈ ముందుకు వచ్చింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయ ప్రయాణాలకు పూర్తి స్థాయి అనుమతులు లేని నేపథ్యంలో దాని గురించి మాట్లాడే ప్రశ్నే లేదు' అని ధుమాల్ అన్నారు.
2008లో ప్రారంభమైన ఐపీఎల్ గత 12 ఏళ్లుగా బీసీసీఐకి కాసుల వర్షం కురిపించింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)ని సైతం శాసించే స్థాయికి బీసీసీఐ ఆర్థికంగా ఎదిగింది. ఈ టోర్నీకి పోటీగా క్రికెట్ ప్రపంచంలోని చాలా దేశాలు టీ20 లీగ్స్ని మొదలెట్టినా అంతగా సక్సెస్ కాలేదు. పాకిస్థాన్ సూపర్ లీగ్, కరేబియన్ ప్రీమియర్ లీగ్ కొంత ఆదరణ పొందాయి.