లాహోర్: పాక్ క్రికెట్ జట్టు ప్రదర్శన పైన ఆ జట్టు కోచ్ మిక్కీ ఆర్థర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగో వన్డేలో ఘోర పరాజయంపాలైన అనంతరం అనంతరం ఆయన మాట్లాడారు. తమ జట్టు ఆటతీరు ఇలాగే ఉంటే త్వరలో జరగనున్న వన్డే ప్రపంచ కప్, ట్వంటీ 20 ప్రపంచ కప్లలో ఆడడం కూడా అనుమానమే అన్నాడు. మొహమ్మద్ ఇర్ఫాన్ ఫిట్నెస్ పైన అసంతృప్తి వ్యక్తం చేశాడు.
అయితే ప్రపంచ కప్ను గెలుచుకున్న పాకిస్థాన్ జట్టు ఆటతీరు ఈ స్థాయికి చేరుకోవడం వెనుక లోపాలు ఏమిటో గుర్తించాలని కోచ్ సూచించాడు. ఇంత దిగజారిపోవడం అసహ్యం కలిగిస్తోందన్నాడు. ఆట తీరును సమీక్షించుకోవాలని ఆయన ఆటగాళ్లకు సూచించాడు.

ప్రస్తుతం పాకిస్తాన్ జట్టు వన్డే ర్యాంకింగ్స్లో తొమ్మిదో స్థానంలో ఉంది. ఇంగ్లండ్ పైన ఓటమి అనంతరం ఆ జట్టు ర్యాంకింగ్లో ఎలాంటి మార్పు లేదు. అయితే ప్రపంచ కప్లో ర్యాంకింగ్స్లోని టాప్ ఎనిమిది జట్లకు మాత్రమే స్థానం ఉంటుంది.
ఆ తర్వాత ర్యాంకుల్లో ఉన్న జట్లు అంటే పాక్ కంటే తక్కువ స్థాయి కలిగిన ఐర్లాండ్, యూఏఈ, ఆఫ్ఘనిస్తాన్, కెన్యా వంటి జట్లతో పోటీ పడి విజయం సాధించాలి. వాటిపై విజయం సాధించిన టాప్ రెండు జట్లు మాత్రమే ప్రపంచ కప్లో ఆడేందుకు అర్హత పొందుతాయి.
అఫ్రిదిపై వేటు
షాహిద్ అఫ్రిదిపై వేటు పడింది. ఇంగ్లాండ్తో వచ్చే బుధవారం జరగనున్న ఏకైక ట్వంటీ 20 మ్యాచ్ కోసం 13 మందితో కూడిన జట్టును ప్రకటించిన సెలక్టర్లు అందులో అఫ్రిదికి మొండిచేయి చూపారు. ఈ ఏడాది ఏప్రిల్లో ముగిసిన ట్వంటీ 20 ప్రపంచకప్లో పాకిస్థాన్ జట్టు ఘోర వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ అఫ్రిది కెప్టెన్సీని వదులుకున్నాడు.
అయితే అంతర్జాతీయ క్రికెట్ నుంచి మాత్రం వైదొలగనని, ఆటగాడిగా ట్వంటీ 20 జట్టులో కొనసాగుతానని అప్పట్లో అఫ్రిది ప్రకటించాడు. అతనితో పాటు ప్రపంచకప్ ఆడిన సీనియర్ ఆటగాళ్లు అహ్మద్ షెహజాద్, ఉమర్ అక్మల్ కూడా జట్టులో స్థానం కోల్పోయారు.
ట్వంటీ 20 జట్టులో అఫ్రిదిని ఎంపిక చేయకపోవడంపై చీఫ్ సెలక్టర్ ఇంజిమామ్ ఉల్ హక్ మాట్లాడుతూ.. దేశవాళీ మ్యాచ్ల్లో ఆడి మునుపటి ఫాంను అఫ్రిది అందుకోగలిగితే జట్టులో అవకాశం దక్కుతుందని గతంలోనే చెప్పామని, అతనితో పాటు అహ్మద్, ఉమర్లు క్రమశిక్షణతో ఉండి, మెరుగైన ప్రదర్శన చేయగలిగితే కచ్చితంగా వారి ఆటతీరును పరిగణలోకి తీసుకుంటామని చెప్పాడు. ఏకైక ట్వంటీ 20 మ్యాచ్ కావడంతో భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని జట్టును ఎంపిక చేశామన్నాడు.