
యంగ్ టీమిండియా బౌలర్ అర్ష్దీప్ సింగ్ మెచురిటీ తనను ఎంతగానో ఆశ్చర్యపరిచిందని.. డెత్ ఓవర్లలో అతని అద్భుత ప్రదర్శనే అతనికి జాతీయ జట్టులో చోటు కల్పించిందని భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడే ఈ లెఫ్టార్మ్ పేసర్ అర్ష్దీప్కు నైపుణ్యవంతమైన యార్కర్లు వేయగల సామర్థ్యం ఉంది. డెత్ ఓవర్లలో ఎంతో కూల్గా బౌలింగ్ చేయగలడు.
ఈ ప్రతిభే అతన్ని ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్ జట్టుకు ఎంపికయ్యేందుకు అవకాశాలు కల్పించొచ్చు. గత నెల ఇంగ్లాండ్తో జరిగిన టీ20లో అర్షదీప్ సింగ్ అరంగేట్రం చేశాడు. వెస్టిండీస్తో జరిగిన తొలి టీ20లో అర్షదీప్ సింగ్ తన రెండో మ్యాచ్ ఆడాడు. 23ఏళ్ల అర్షదీప్ మొదటి మ్యాచ్లో ఇంగ్లండ్పై 2/18 ప్రదర్శన కనబర్చగా.. రెండో మ్యాచ్లో వెస్టిండీస్పై 2/24ప్రదర్శనతో మెరిశాడు.

'అర్ష్దీప్ సింగ్లో ఉన్న గొప్ప లక్షణమేంటంటే.. అతనికి గేమ్ పరంగా తాను ఏమి చేయాలో అతనికి కచ్చితంగా స్పష్టంగా తెలుసు. ఎలాంటి ఫీల్డ్ సెట్టింగ్ ఎంచుకోవాలి. ఏ బ్యాట్స్మన్కి ఎలాంటి తరహా బంతులు వేయాలి. ఇవన్నీ అర్షదీప్కు తెలుసు. అతను చాలా విషయాల్లో మంచి అవగాహన కలిగి ఉన్నాడు. కొత్త కుర్రాళ్లలో చాలా తక్కువమందికి మాత్రమే అలాంటి మెచురిటీ ఉంటుంది.
సాధారణంగా ఏళ్లుగా ఆడుతున్నప్పుడు కలిగే అవగాహన, నేర్చుకునే అంశాలను అతను చాలా తొందరగానే నేర్చుకుని క్రికెట్ ఆడుతున్నాడు. అతనిలో అపూర్వమైన మెచురిటీ ఉన్నట్లు అనిపిస్తుంది. గత రెండేళ్లుగా ఐపీఎల్లో కూడా అతను నిలకడగా రాణిస్తున్నాడు. అతను ఏమి చేయాలనుకుంటున్నాడో అతనికి ఖచ్చితంగా తెలుసు. అతను తన ఆట గురించి చాలా మెరుగ్గా ఆలోచిస్తాడు.' అని భువీ అర్షదీప్ను పొగిడాడు.
వెస్టిండీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ ప్రస్తుత క్రికెట్ వ్యాఖ్యాత ఇయాన్ బిషప్, అలాగే న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డేనియల్ వెట్టోరి సైతం అర్షదీప్ సింగ్ను ఎంతో నైపుణ్యమున్న ప్లేయర్ అంటూ కొనియాడిన సంగతి తెలిసిందే. ఇకపతే ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచ కప్ జట్టులో అర్ష్దీప్ లాంటి ప్లేయర్ ఉంటే తప్పకుండా అతని నైపుణ్యం జట్టుకు ఉపయోగపడుతుందని వెటోరి కొనియాడాడు. ఇకపోతే టీ20 ప్రపంచకప్ ఈవెంట్ అక్టోబర్ 16నుంచి నవంబర్ 13వరకు జరగనుంది.