‘అవేశ్ ఖాన్ కంటే అర్షదీప్ను ఎంపిక చేయాల్సింది’ జరిగిందేదో జరిగిందంటూ ఆశిష్ నెహ్రా విశ్లేషణ..!

దక్షిణాఫ్రికాతో గురువారం జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత జట్టు 7వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో 212పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో టీమిండియా విఫలమైంది. దీంతో భారత బౌలర్ల మీద, రిషబ్ పంత్ కెప్టెన్సీ మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ మ్యాచ్లో భారత బౌలర్లు కేవలం 3వికెట్లు మాత్రమే తీయగలిగారు. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా ప్రతి బౌలర్ ఎకానమీ రేటు 8.50కంటే ఎక్కువగా నమోదు కావడం గమనార్హం. ఇకపోతే ఈ మ్యాచ్ గురించి తన విశ్లేషణ అందించిన భారత మాజీ పేసర్, గుజరాత్ టైటాన్స్ ప్రధాన కోచ్ ఆశిష్ నెహ్రా.. జట్టులో అవేశ్ ఖాన్ కంటే ముందుగా అర్ష్దీప్ సింగ్ని ఎంపిక చేసి ఉండాల్సిందని పేర్కొన్నాడు. ఇక తొలి మ్యాచ్లో హార్దిక్ పాండ్యాతో సహా భారత్ ముగ్గురు స్పెషలిస్ట్ పేసర్లతో బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.

బౌలింగ్, కెప్టెన్సీ మీద విమర్శలు
ఇక ఈ మ్యాచ్లో భువనేశ్వర్ కుమార్ తన మొదటి రెండు పవర్ప్లే ఓవర్లలో దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా వికెట్ తీయడంతో సహా కేవలం ఏడు పరుగులు ఇచ్చి ఆకట్టుకున్నాడు. కానీ చివర్లో మాత్రం ధారాళంగా పరుగులిచ్చుకున్నాడు. ఇక ఐదో ఓవర్లో హార్దిక్ పాండ్యా 18పరుగులు ఇవ్వడంతో అతనికి బౌలింగ్ పరంగా యుటిలైజ్ చేసుకోవడానికి రిషబ్ పంత్ పెద్దగా ఆసక్తి చూపలేదు. ఇక అక్షర్ పటేల్ను నాలుగు ఓవర్లు వేయించిన పంత్, చాహల్తో కేవలం రెండు ఓవర్లే వేయించి విమర్శలపాలయ్యాడు. ఇక హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అవేశ్ ఖాన్ చివర్లో పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో డేవిడ్ మిల్లర్, రాస్సీ వాన్ డెర్ డుస్సేన్ కడవరకు క్రీజులో ఉండి దక్షిణాఫ్రికా జట్టుకు భారీ విజయాన్ని సాధించి పెట్టారు.

టీమిండియా స్క్వాడ్లో ఏకైక ఎడమచేతి పేసర్
ఈ మ్యాచ్లో అవేష్ ఖాన్ తన మొదటి ఓవర్లో 15పరుగులు ఇచ్చాడు. అతను తన తర్వాతి 3ఓవర్లలో కేవలం 20పరుగులతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఈ మ్యాచ్లో అత్యంత పొదుపుగా వేసిన టీమిండియా బౌలర్ అవేశ్ ఖానే. డెత్ ఓవర్ స్పెషలిస్ట్ అయిన అర్షదీప్ సింగ్, స్పీడ్ స్టార్ అయిన ఉమ్రాన్ మాలిక్ వంటి అన్క్యాప్డ్ పేసర్ల కంటే ముందు ప్లేయింగ్ 11లో అవేశ్ ఖాన్ ఎంపికయ్యాడు. ఇక అర్షదీప్ సింగ్ పంజాబ్ కింగ్స్ తరఫున 7.70ఎకానమీ రేటుతో 10వికెట్లు తీసి డెత్ ఓవర్లలో స్పెషలిస్ట్ బౌలర్గా పేరొందాడు. ఇక అర్షదీప్ దక్షిణాఫ్రికా సిరీస్కు ఎంపికైన ఏకైక ఎడమచేతి వాటం పేసర్.

అదే జట్టుతో మూడు మ్యాచ్లు ఆడించాలి
ఆశిష్ నెహ్రా మొదటి మ్యాచ్ గురించి తన అభిప్రాయం పంచుకుంటూ.. 'అవేష్ ఖాన్ కంటే అర్షదీప్ సింగ్ను తొలి టీ20లో ఆడించాల్సింది. జరిగిందేదో జరిగింది. ఇప్పుడు వెంటనే అవేష్ ఖాన్ను తప్పించొద్దు. ఇప్పుడు రెండో టీ20 మ్యాచ్కు కూడా అదే ప్లేయింగ్ 11జట్టులో అవేశ్ ఖాన్ను ఉంచాలి. తదుపరి మ్యాచ్ కటక్లో ఉంది. అక్కడ కూడా హై స్కోర్ మ్యాచ్లే జరుగుతాయి. ఇక గత మ్యాచ్లో కేవలం ఇద్దరు బ్యాటర్లు చివరి వరకు ఆడి మీ నుంచి గేమ్ను దూరం చేశారు. అంత మాత్రాన పూర్తిగా జట్టులో మార్పులు చేపట్టాల్సిన పని లేదు. టీమిండియా ప్రస్తుత జట్టుతో మూడు మ్యాచ్లు ఆడాలి. భారత్ మొదటి గేమ్లో ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని పెద్దగా భయపడకుండా రెండో మ్యాచ్లో రాణించాలి' అని నెహ్రా క్రిక్బజ్తో తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications