టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఓడిన న్యూజిల్యాండ్, టీమిండియా రెండు జట్లు ఇక వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్పై ఫోకస్ పెట్టాయి. ఈ క్రమంలో ఈ రెండు జట్ల మధ్య జరిగే వన్డే సిరీస్ కీలకంగా మారింది. మెడికల్ అప్పాయింట్మెంట్ వల్ల మూడో టీ20కి దూరమైన కివీ కెప్టెన్ కేన్ విలియమ్సన్.. ఈ సిరీస్కు అందుబాటులోకి వచ్చాడు. వెటరన్ ప్లేయర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గైర్హాజరీలో యువ భారత జట్టును శిఖర్ ధవన్ ముందుండి నడిపించేందుకు సిద్ధమయ్యాడు.
ఆక్లాండ్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో కివీ సారధి విలియమ్సన్ టాస్ గెలిచాడు. చిన్న బౌండరీలు ఉండే ఈ మైదానంలో టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్ చేసే అవకాశమే ఎక్కువగా ఉంది. ఇదే విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న విలియమ్సన్ మరో ఆలోచన లేకుండా తాము ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. జట్టులో మొత్తం నలుగురు సీమర్లు ఉన్నారని, వారితోపాటు మిచెల్ శాంట్నర్ ఆడుతున్నాడని వెల్లడించాడు. దీంతో ఐష్ సోధికి జట్టులో చోటు దక్కలేదు. గతంలో అంటే 2014లో ఇదే మైదానంలో భారత్, న్యూజిల్యాండ్ ఆడిన వన్డేలో రెండు జట్లూ ఒకే స్కోరు చేయడంతో మ్యాచ్ టై అయింది. ఈసారి కూడా అలాంటి ఫలితమే వస్తుందా? లేక మారుతుందా? చూడాలి.
టాస్ గెలిస్తే ముందుగా బౌలింగ్ చేయాలనే తను కూడా అనుకున్నట్లు టీమిండియా సారధి శిఖర్ ధవన్ చెప్పాడు. ఈ మ్యాచ్లో ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లలో బరిలో దిగుతున్నట్లు వెల్లడించాడు. అలాగే సంజూ శాంసన్ కూడా ఆడుతున్నట్లు చెప్పాడు. ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్ ఇద్దరూ ఈ మ్యాచ్లో అరంగేట్రం చేస్తున్నట్లు ప్రకటించాడు. అయితే ఈ జట్టులో బౌలింగ్ ఆప్షన్లు పెద్దగా లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఐదుగురు బౌలర్లే అన్ని ఓవర్లు వేయాల్సి ఉంటుంది. దీపక్ హుడాను తీసుకొని ఉంటే మరో బౌలింగ్ ఆప్షన్ ఉండేదని కొందరు అంటున్నారు. మరి ధవన్ ఏం ప్లాన్ చేశాడో చూడాలి.
టీమిండియా: శిఖర్ ధవన్ (కెప్టెన్), శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్
న్యూజిల్యాండ్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, టామ్ లాథమ్, డారియల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్, ఆడమ్ మిల్నే, మ్యాట్ హెన్రీ, టిమ్ సౌథీ, లోకీ ఫెర్గూసన్