రెండు నెలల పాటు శిక్షణ:
మిలటరీలో పనచేయాలని ఇటీవలే ధోనీ భారత ఆర్మీ ఉన్నతాధికారులను కూడా దరఖాస్తు చేసాడు. తాజాగా భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్.. ధోనీ దరఖాస్తుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం తెలిసింది. దీంతో ధోనీ ప్యారాచూట్ రెజిమెంట్ బెటాలియన్లో రెండు నెలల పాటు శిక్షణ తీసుకుంటాడు. కశ్మీర్ లోయ పరిసర ప్రాంతాల్లో శిక్షణ ఉండే అవకాశం ఉంది. అయితే ధోనీ సైనిక చర్యల్లో భాగం కాలేడని తెలిసింది.
వికెట్ కీపర్గా పంత్:
ఆగస్టు 3 నుండి ప్రారంభం కానున్న వెస్టిండీస్ టూర్కు టీమిండియా జట్లను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఆదివారం ప్రకటించింది. ధోనీ వెస్టిండీస్ టూర్ నుండి స్వయంగా తప్పుకోవడంతో యువ ఆటగాడు రిషబ్ పంత్ను వికెట్ కీపర్గా ఎంపిక చేశారు. అయితే టెస్ట్లకు వృద్ధిమాన్ సాహాను ప్రత్యామ్నయ కీపర్గా ఎంపిక చేశారు. వెస్టిండీస్ టూర్లోని మూడు ఫార్మాట్లలోనూ పంత్ ఆడనున్నాడు.
మా ప్రణాళిక అదే:
జట్ల సెలక్షన్ అనంతరం ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ... 'ఎంఎస్ ధోనీ వెస్టిండీస్ పర్యటనకు అందుబాటులో ఉండటం లేదు. అతను టూర్కు అందుబాటులో ఉండను అని ముందే తెలిపాడు. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్కు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని అనుకుంటున్నాం. ప్రస్తుతం మా ప్రణాళిక అదే' అని ఎమ్మెస్కే తెలిపారు.
రిటైర్మెంట్ ధోనీ వ్యక్తిగత విషయం:
'ధోనీ భవిష్యత్తు గురించి అతనితో చర్చించాం. రిటైర్మెంట్ ధోనీ వ్యక్తిగత విషయం. ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకోవాలో ధోనీకి తెలుసు. కానీ మేం మా భవిష్యత్తు ప్రణాళికలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటాం. ప్రపంచకప్లో ధోనీ స్ట్రైక్రేట్ గురించి ఆలోచించడం లేదు. జట్టు భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని యువ ఆటగాళ్లను సిద్ధం చేసుకుంటున్నాం' అని ఎమ్మెస్కే పేర్కొన్నారు.