క్రికెట్ ప్రపంచంలో తమ ఆటతో అశేష కీర్తి ప్రతిష్టలు సంపాదించిన అనేక దిగ్గజాలు కొన్నిసార్లు వివాదాలతోనూ వార్తల్లో నిలుస్తుంటారు. అలాంటి ఒక సంచలనాత్మక ఘటనే 2018లో వెలుగులోకి వచ్చింది. శ్రీలంక క్రికెట్ జట్టుకు 1996లో తొలి, ఏకైక వన్డే ప్రపంచ కప్ను అందించిన మాజీ కెప్టెన్ అర్జున రణతుంగపై ఒక భారతీయ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలు అప్పట్లో క్రీడా వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టించాయి.
మీటూ ఉద్యమ సమయంలో బయటపడిన షాకింగ్ ఘటన
2018లో 'మీటూ' ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా పతాక స్థాయికి చేరినప్పుడు లైంగిక వేధింపులకు గురైన అనేక మంది మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి తమ చేదు అనుభవాలను ప్రపంచం ముందు వెల్లడించారు. ఇదే సమయంలో ఒక భారతీయ ఎయిర్ హోస్టెస్ కూడా తనకు ఎదురైన లైంగిక వేధింపులను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఆమె ఆరోపణల ప్రకారం.. అర్జున రణతుంగ తన నడుము పట్టుకుని.. తన ఛాతీని తాకడం మొదలుపెట్టాడన్నారు. వెంటనే తాను ప్రతిఘటించి, అతడిని కాలితో తన్ని తప్పించుకున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటన జరిగిన వెంటనే తాను హోటల్ రిసెప్షన్కు వెళ్లి ఫిర్యాదు చేశానని.. అయితే హోటల్ సిబ్బంది అది మీ వ్యక్తిగత విషయమని చెప్పి.. ఈ విషయంలో జోక్యం చేసుకోలేదని ఆమె పేర్కొంది. హోటల్ సిబ్బంది వైఖరి పట్ల ఆమె తీవ్ర నిరాశ వ్యక్తం చేసింది.

ముంబై హోటల్లో ఘటన.. ఎయిర్ హోస్టెస్ సంచలన ఆరోపణలు
ఆ భారతీయ ఎయిర్ హోస్టెస్ కథనం ప్రకారం.. ప్రపంచ ఛాంపియన్ కెప్టెన్ అర్జున రణతుంగ ముంబైలోని ఒక హోటల్లో తనతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ దారుణమైన ఘటన జుహులోని హోటల్ సెంఠార్లో జరిగిందని మహిళ తెలిపింది. ఆ సమయంలో భారత్, శ్రీలంక జట్లు అక్కడే బస చేశాయి. ఎయిర్ హోస్టెస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆమె తన స్నేహితురాలితో కలిసి క్రికెటర్లను కలవడానికి హోటల్కు వెళ్లింది. ఆమె స్నేహితురాలు ఒక భారతీయ క్రికెటర్తో కలిసి స్విమ్మింగ్ పూల్ వైపు వెళ్లగా.. తాను ఒంటరిగా మిగిలిపోయానని వెల్లడించింది. అదే సమయంలో అర్జున రణతుంగ తనతో అనుచితంగా ప్రవర్తించినట్లు, తనను లైంగికంగా వేధించినట్లు ఆమె ఆరోపించింది.
అర్జున రణతుంగ కెరీర్పై 'మీటూ' మరక
అర్జున రణతుంగ క్రికెట్ రికార్డు చాలా గొప్పగా ఉంది. రణతుంగ టెస్టుల్లో 5105 పరుగులు, వన్డేల్లో 7456 పరుగులు సాధించి శ్రీలంక క్రికెట్ చరిత్రలో ఒక దిగ్గజంగా నిలిచాడు. ముఖ్యంగా 1996లో రణతుంగ కెప్టెన్సీలో శ్రీలంక తొలిసారిగా వన్డేను ప్రపంచ కప్ను గెలుచుకోవడం ఒక చారిత్రక ఘట్టం. క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక, రణతుంగ తన దేశానికి పెట్రోలియం మంత్రిగా కూడా పనిచేశాడు. అయితే ఈ లైంగిక వేధింపుల వివాదం అతని సుదీర్ఘ రాజకీయ, క్రీడా కెరీర్పై ఒక చీకటి మచ్చగా మిగిలింది.
'మీటూ ఉద్యమం' సమయంలో వెలుగులోకి వచ్చిన అనేక గొంతుకల్లో ఇదీ ఒకటి. ఈ ఘటన క్రికెట్ ప్రపంచంలోని మెరుపు, విజయాల వెనుక ఉన్న చీకటి కోణాన్ని, అధికారంలో ఉన్న వ్యక్తులు తమ స్థానాన్ని దుర్వినియోగం చేసే ప్రమాదాన్ని బయటపెట్టింది.