హైదరాబాద్: క్రీడల్లో అద్భుత ప్రదర్శన కనబర్చినందుకు గాను 2017 సంవత్సరానికి గాను క్రికెటర్ ఛటేశ్వర్ పుజారాతో పాటు మరో 16 మందికి కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డుని ప్రకటించిన సంగతి తెలిసిందే. అర్జున అవార్డు దక్కిన సందర్భంలో పుజారా మీడియాతో మాట్లాడాడు.
'ఈ అవార్డు దక్కడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. కష్టపడేవారికి తగిన గౌరవం దక్కుతుందని మరోసారి రుజువైంది. మరింత కష్టపడుతూ భవిష్యత్తులో రాణించే దిశగా ఈ అవార్డు నాకు ఎంతో ప్రేరణ కలిగించింది' అని 29 ఏళ్ల పుజారా పీటీఐతో అన్నాడు.

ఈ ఏడాది పుజారా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇప్పటివరకు తాను ఆడిన 19 టెస్టుల్లో 62.48 యావరేజితో 1687 పరుగులు నమోదు చేశాడు. అంతేకాదు 12 నెలల కాలంలో పుజారా 6 సెంచరీలు నమోదు చేశాడు.
ఇటీవల శ్రీలంకతో ముగిసిన మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో పుజారా 309 పరుగులు సాధించాడు. 'గత ఏడాదిరన్నగా టెస్టుల్లో నా ప్రదర్శన పట్ల సంతృప్తికరంగా ఉంది. ఈ సిరిస్కు ముందు ఇంగ్లండ్ కౌంటీల్లో నాటింగ్హామ్ షైర్ తరుపున క్రికెట్ ఆడటం ఎంతో కలిసొచ్చింది. భవిష్యత్తులోనూ ఇలాగే కొనసాగాలని అనుకుంటున్నాను' అని అన్నాడు.
'2015లో శ్రీలంకలో ఆడిన అనుభవం ఇప్పుడు కలిసి వచ్చింది. ఈ సిరీస్కి ముందు దేశవాళీ క్రికెట్ ఆడాను. అది కూడా ఉపయోగపడింది. ప్రస్తుత భారత టెస్టు క్రికెట్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఎంతో పటిష్టంగా ఉంది' అని పుజారా తెలిపాడు.
శ్రీలంకతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్లో పుజారా అరుదైన మైలురాయిని అందుకున్న సంగతి తెలిసిందే. అదేంటంటే టెస్టుల్లో అత్యంత వేగంగా నాలుగు వేల పరుగుల మైలురాయిని అందుకున్న రెండో భారత బ్యాట్స్మెన్గా రాహుల్ ద్రవిడ్(84వ ఇన్నింగ్స్)తో సంయుక్తంగా నిలిచాడు.
పుజారా ఈ ఘనతను తన 84వ ఇన్నింగ్స్లో సాధించాడు. అంతకముందు సెహ్వాగ్, సునీల్ గవాస్కర్లు తమ 81వ ఇన్నింగ్స్లోనే టెస్టుల్లో నాలుగు వేల పరుగుల మైలురాయిని అందుకున్నారు. 51 టెస్టులాడిన పుజారా 85 ఇన్నింగ్స్ల్లో 4,107 పరుగులు సాధించాడు. ఇందులో 13 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.