ఐపీఎల్ 2026 సీజన్ 19వ ఎడిషన్ రసవత్తరంగా సాగుతోంది. పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ కేపిటల్స్ వరుస విజయాలతో దూసుకెళ్తోన్నాయి. పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఇప్పటికీ కోల్ కత నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ బోణీ కొట్టట్లేదు. వర్షం వల్ల పంజాబ్ కింగ్స్ తో జరగాల్సిన మ్యాచ్ రద్దు కావడం వల్ల కేకేఆర్ ఖాతాలో ఓ పాయింట్ వచ్చి పడిందంతే. ఇప్పటివరకు ఆడిన రెండింట్లోనూ ఆడిందా జట్టు..
కాగా- ఈ నెల 9న లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడనుంది కేకేఆర్. లక్నో జట్టు పరిస్థితి కేకేఆర్ కంటే కొద్దిగా మెరుగ్గా ఉందే తప్ప రెండింటికీ పెద్ద తేడా కనిపించట్లేదు. ఒక మ్యాచ్ లో ఓడి.. ఇంకో దాంట్లో గెలిచింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. చివరి మూడు స్థానాల్లో కేకేఆర్, గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఉన్నాయి. ఎల్లుండి జరిగే మ్యాచ్ కోసం కేకేఆర్, ఎల్ ఎస్ జీ నెట్స్ లో శ్రమిస్తోన్నాయి.

కాగా- నెట్ ప్రాక్టీస్ లో అర్జున్ టెండుల్కర్ రెచ్చిపోయాడు. బౌలింగ్ తడాఖా చూపాడు. పెళ్లి తర్వాత గ్రౌండ్ లో అడుగు పెట్టిన ఈ బౌలర్ ప్రత్యేకించి కేప్టెన్ రిషభ్ పంత్ కు చుక్కలు చూపాడు. అద్భుతమైన యార్కర్లతో ఉక్కిరిబిక్కిరి చేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. లైన్ అండ్ లెంగ్త్ కు కట్టుబడి పదునైన యార్కర్లను సంధించాడు. వీటికి పంత్ వద్ద సమాధానమే లేకుండా పోయింది. వాటిని ఆడటంలో ఇబ్బంది పడ్డాడు.
పెళ్లి తర్వాత అర్జున్ టెండుల్కర్ గ్రౌండ్ లో దిగడం ఐపీఎల్ తోనే ఆరంభం. అంతకుముందు రంజీలకు దూరం అయ్యాడు. ఐపీఎల్ లో పెద్దగా ట్రాక్ రికార్డు లేదీ కుర్రాడికి. గతంలో ముంబై ఇండియన్స్ కు ప్రాతినిథ్యాన్ని వహించాడు గానీ రాణించలేకపోయాడు. ఇప్పుడు లక్నో సూపర్ జెయింట్స్ కు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నాడు. అర్జున్ వరుస యార్కర్లతో పంత్తో సహా సీనియర్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టడం, వీటిని స్వయానా ఫ్రాంఛైజీనే షేర్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
అతను నిలకడగా స్టంప్స్ బేస్ టార్గెట్ చేయడం అద్భుతమనిపించింది. ఇప్పటి వరకు తుది జట్టులో చోటు దక్కించుకోనప్పటికీ యువ ఆల్ రౌండర్ తన క్రమశిక్షణతో కూడిన విధానం, ఖచ్చితత్వంతో జట్టులో స్థానం కోసం గట్టి పోటీనిస్తున్నట్లు కనిపిస్తున్నాడు. బ్లాక్హోల్ను లక్ష్యంగా చేసుకుని బౌలింగ్ చేయడంలో విజయం సాధించడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. దీంతో చాలా మంది అతన్ని జట్టులోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.