హైదరాబాద్: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ భారత్ అండర్-19 తరఫున అరంగేట్రం మ్యాచ్లోనే మెరిశాడు. కొలంబో వేదికగా శ్రీలంక అండర్-19 జట్టుతో మంగళవారం ఆరంభమైన మ్యాచ్లో తానేసిన రెండో ఓవర్లోనే అర్జున్ వికెట్ పడగొట్టాడు. అర్జున్ విసిరిన బంతిని అర్థం చేసుకోవడంలో విఫలమైన శ్రీలంక ఓపెనర్ మిశ్రా (9: 11 బంతుల్లో 2x4) వికెట్ల ముందు దొరికిపోయాడు.
శ్రీలంక అండర్-19 జట్టుతో రెండు అనధికార నాలుగు రోజుల టెస్టులు, 5 వన్డేలు ఆడనుంది. ఈ క్రమంలో.. జూన్లో బీసీసీఐ ప్రకటించిన భారత అండర్-19 జట్టులో అర్జున్ మొదటిసారి బౌలింగ్ కోటాలో చోటు దక్కించుకున్నాడు. కొలంబో వేదికగా మంగళవారం భారత్-శ్రీలంక మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. అయితే.. ఈ ఎంపికపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో.. ఇప్పుడు అందరి దృష్టి అర్జున్పై పడింది. ఈ మ్యాచ్ ద్వారా అర్జున్ భారత్ తరఫున తొలి మ్యాచ్ ఆడే అవకాశం దక్కింది.
టాస్ గెలిచిన లంక జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. మిషారా-ఫెర్నాండో లంక ఇన్నింగ్స్ను ఆరంభించారు. మ్యాచ్లో తొలి ఓవర్ బౌలింగ్ చేసిన అర్జున్ ఆరు పరుగులివ్వగా.. ఓపెనర్ మిశ్రా బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా చూడచక్కని ఫోర్ కొట్టాడు. అర్జున్ వేసిన రెండో ఓవర్(ఇన్నింగ్స్ మూడో ఓవర్)లోని చివరి బంతిని ఎదుర్కొన్న మిషారా (9) ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ బాటపట్టాడు. అనధికార టెస్టులు కాబట్టి ఈ గణాంకాలన్నీ ఐసీసీ పరగణనలోనికి రావు.
అనూజ్ రావత్ భారత అండర్-19 జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. తొలి రోజు ఆటలో 32 ఓవర్లు ముగిసే సమయానికి లంక అండర్-19 జట్టు మూడు వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. ఆ తర్వాత మూడో ఓవర్లోనూ అర్జున్ బౌలింగ్లో ఒక ఫోర్ కొట్టిన మిశ్రా తర్వాత బంతికే వికెట్ల ముందు దొరికిపోయాడు. మ్యాచ్లో భారత జట్టుకి లభించిన తొలి వికెట్ కూడా ఇదే.