ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్ఫూర్తితో బ్యాట్ పట్టిన అతని తనయుడు అర్జున్ టెండూల్కర్ ముంబైలోని సచిన్ టెండూల్కర్ మైదానంగా మారిన జింఖానా స్టేడియంలో మంగళవారం జరిగిన ఎంసిఏ అండర్16 పయ్యాడే ట్రోఫీ మ్యాచులో శతకం బాదాడు.
సచిన్ టెండూల్కర్ జింఖానా స్టేడియంలో ఈ జూనియర్ టెండూల్కర్ 156 బంతుల్లో 106 పరుగులు సాధించాడు. ఇందులో 16 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. అర్జున్ శతకంతో అతని జట్టు 218 పరుగులు చేయగలిగింది.
మరో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్-11 జట్టు తరపున ఈ ఎడమ చేతివాటం అర్జున్ ఆడుతున్నాడు. రోహిత్ శర్మ-11 జట్టు ఇతని ప్రత్యర్థి జట్టు.
ఈ టోర్నమెంటులో మొత్తం 4 జట్లు పాల్గొంటుండగా, వీటిలో సచిన్ టెండూల్కర్-11, దిలీప్ వెంగ్సర్కార్-11లు కూడా ఉన్నాయి. ముంబై-16 జట్టుకు ఆటగాళ్ల ఎంపికలో భాగంగా ఈ మ్యాచులు నిర్వహిస్తున్నారు.

కాగా, అర్జున్ టెండూల్కర్ తన సహజ ఆటతీరుతో ఆకట్టుకున్నాడని టీం కోచ్ వికాస్ సతమ్ తెలిపారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడిన అర్జున్.. తనదైన ఆటతీరుతో సెంచరీ చేశాడని చెప్పారు. వికెట్లు పడుతున్నప్పటికీ అర్జున్ నిలకడగా ఆడి జట్టు స్కోరును పెంచాడని తెలిపారు.
ఎంసిఏ-16 జట్టుకు ఎంపికయ్యే అర్హతలు అర్జున్కు ఉన్నాయని చెప్పారు.
కాగా, నిరుడు స్మాష్ మాస్టర్ బ్లాస్టర్ స్కూల్ క్రికెట్ ఛాంపియన్షిప్లో భాగంగా ధీరూభాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన పాఠశాల స్థాయి అండర్-16 టోర్నీలో కూడా అర్జున్ టెండూల్కర్ 42 బంతుల్లో 118 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. గత జూలైలో ఇంగ్లాండ్ ఆటగాళ్లకు బౌలింగ్ చేసిన అర్జున్.. వారి నుంచి ప్రశంసలు పొందాడు.
ఇది ఇలా ఉండగా, మీడియా తన తనయుడిపై ఎక్కువగా దృష్టి సారించి అతన్ని ఇబ్బంది పెట్టొద్దని 2013లో సచిన్ టెండూల్కర్ మీడియాకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. నేను క్రికెటర్ను కాబట్టి తన కొడుకుపై ఒత్తిడి ఉంటుందని, అలా తనపై ఒత్తిడి లేదని ఎందుకంటే తన తండ్రి ప్రొఫెసర్ కావడం వల్లేనని చెప్పాడు సచిన్. తన కొడుకుపై ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉంటేనే బాగుంటుందని కోరుకుంటున్నట్లు తెలిపాడు.