
ఒకే ఓవర్లో అయిదు సిక్సర్లు:
పోలీస్ ఇన్విటేషన్ షీల్డ్ టోర్నీ గ్రూప్-ఎలో భాగంగా ఆదివారం రెండో రౌండ్ మ్యాచులు జరిగాయి. ఎంఐజీ క్రికెట్ క్లబ్ తరఫున అర్జున్ టెండూల్కర్ ఆడాడు. ఇస్లాం జింఖానాతో జరిగిన మ్యాచ్లో అతడు విజృంభించాడు. 31 బంతుల్లో 77 పరుగులతో బాదడంతో పాటు మూడు వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును చిత్తుచేశాడు. అర్జున్ ఇన్నింగ్స్లో ఐదు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు ఉన్నాయి. స్పిన్నర్ హషీర్ వేసిన ఓ ఓవర్లో ఏకంగా ఈడూ సిక్సర్లు బాదడం విశేషం. అర్జున్ చెలరేగడంతో జింఖానా జట్టుపై ఎంఐజీ 194 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.

మూడు వికెట్లు:
మొదట ఎంఐజీ 45 ఓవర్లలో ఏడు వికెట్లకు 385 పరుగులు చేసింది. అర్జున్ టెండూల్కర్ (77)తో పాటు కెవిన్ (96), ప్రగ్నేష్ (112) సత్తాచాటడంతో ఎంఐజీ భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో ఇస్లాం జింఖానా జట్టు 41.5 ఓవర్లలో 191 పరుగులకే కుప్పకూలి పరాజయం పాలైంది. అర్జున్ మూడు వికెట్లు తీశాడు. ముంబై క్రికెట్ అసోషియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ టోర్నీ కరోనా మహమ్మారి విరామం తర్వాత ముంబైలో జరిగిన తొలి క్రికెట్ పోటీగా నిలిచింది. అర్జున్ ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ముంబై తరఫున ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే.
ప్రత్యేక ఆకర్షణగా:
ఐపీఎల్ 2021 వేలానికి ముందు అర్జున్ టెండూల్కర్ ఇలా చెలరేగడం ఆసక్తి నెలకొంది. గురువారం జరగనున్న ఐపీఎల్ వేలంలోనూ అతడు భారీ ధరకు అమ్ముడు పోవడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పుడు అర్జున్ వేలంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు. కనీస ధర రూ.20 లక్షలకు అతడు వేలంలో పాల్గొనబోతున్నాడు. ముంబై ఇండియన్స్ అతడిని కొనుగోలు చేసే అవకాశం ఉందని సమాచారం తెలుస్తోంది. మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీల్లో కేవలం 61 ఖాళీలే ఉన్న ఈ సీజన్ కోసం 292 మంది ఆటగాళ్లు వేలంలో పోటీపడుతున్నారు. అవకాశం ఎవరిని వరిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications












