
హైదరాబాద్: భారీ అంచనాలతో ఐపీఎల్ మొదలుపెట్టినా.. మూడు మ్యాచ్లు ఆడినా ముంబై జట్టుకు ఏ మాత్రం విజయం దక్కలేదు. అంతకంటే దారుణంగా కెప్టెన్ రోహిత్ శర్మ ఏ మాత్రం రాణించలేకపోయాడు. మొదటి మూడు మ్యాచ్ల్లో కలిపి చేసిన పరుగులు 44. ఈ గణాంకాలు చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. కెప్టెన్గా పరువు నిలబెట్టుకోవాల్సిన సమయం.. జట్టు కోసం తీవ్ర కసరత్తు చేశాడు. చివరికి నాలుగో మ్యాచ్ గెలిచాడు.
ఆ మ్యాచ్ గెలవడానికి కారణం క్రికెట్ దిగ్గజం, టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, అతని తనయుడు అర్జున్ టెండూల్కర్లేనట. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ఏకంగా 94 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ ప్రదర్శన చూసిన రోహిత్ అభిమానులు తిరిగి ఊపిరి పీల్చుకున్నారు.
రోహిత్ కు ప్రధాన సమస్య ఎడమ చేతి స్పిన్ బౌలింగ్. దాని నుంచి బయటపడేందుకు అర్జున్ టెండూల్కర్ సహాయం కోరాడట. ఇక అర్జున్ కూడా కొన్ని నెలల నుంచి బౌలింగ్లో నైపుణ్యం సాధించాడు. రెండు విధాల ఇద్దరికీ లాభముండటంతో ప్రాక్టీసులో పాల్గొన్నారు. మ్యాచ్ జరగడానికి ముందురోజు సచిన్ నుంచి కూడా సలహాలు, సూచనలు తీసుకున్నాడు. వీటన్నింటినీ మ్యాచ్లో అమలు చేశాడు.
సచిన్ సలహాలు, అర్జున్తో బంతులేయించుకుని ప్రాక్టీస్ చేయడం రోహిత్కు ఎంత ఉపయోగపడిందో ఆ ఇన్నింగ్స్ చెప్పకనే చెబుతుంది. ఈ మ్యాచ్లో రోహిత్ విధ్వంసం సృష్టించాడు. 52 బంతుల్లో 94 పరుగులు చేశాడు. ఇందులో 10ఫోర్లు, 5 సిక్స్లు బాదాడు. ఈ మ్యాచ్ను అర్జున్ స్వయంగా మైదానానికి వచ్చి మ్యాచ్ వీక్షించాడు. ఏది ఏమైనా ముంబై ఇండియన్స్ ఖాతాలో తొలి విజయం నమోదు కావడానికి ఓ రకంగా అర్జున్ కూడా కారణమైయ్యాడు.