

హైదరాబాద్: టీమిండియా లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ తాను ఆడిన తొలి అంతర్జాతీయ మ్యాచ్లోనే డకౌటయ్యాడు. 11 బాల్స్ ఆడి ఖాతా తెరవకుండానే పెవిలియన్ దారి పట్టాడు. ఇటీవల భారత అండర్-19 జట్టులోకి ఎంపికైన అర్జున్.. శ్రీలంక అండర్-19 జట్టుతో గత మంగళవారం ఆరంభమైన నాలుగు రోజుల యూత్ టెస్టుతో అరంగేట్రం చేశాడు. తుది జట్టులోకి ఆల్రౌండర్ కోటాలో ఎంపికైన అర్జున్ మ్యాచ్లో తానేసిన రెండో ఓవర్ ఆఖరి బంతికే వికెట్ పడగొట్టి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
కానీ, బ్యాటింగ్లో మాత్రం అర్జున్ ఘోరంగా విఫలమయ్యాడు. బ్యాటింగ్ ఆర్డర్లో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన అర్జున్ టెండూల్కర్ 11 బంతులాడి కనీసం ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. శ్రీలంక అండర్ 19 జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో షషిక దుల్షాన్ బౌలింగ్లో బంతిని హిట్ చేయబోయి.. ఫీల్డర్ పసిందుకి సులువైన క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. విశేషం ఏమిటంటే.. సచిన్ కూడా పాకిస్తాన్తో తాను ఆడిన తొలి వన్డే మ్యాచ్లో డకౌటయ్యాడు.
తొలి ఇంటర్నేషనల్ వికెట్ తీసుకోవడానికి కేవలం 12 బంతులే తీసుకున్న అర్జున్.. బ్యాటింగ్లో మాత్రం నిరాశపరిచాడు. బౌలింగ్లో మొత్తం 11 ఓవర్లు వేసిన అర్జున్.. 33 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. అయితే మ్యాచ్లో మాత్రం భారత జట్టు పటిష్ఠ స్థితిలో నిలిచింది. లంకను 244 పరుగులకే ఆలౌట్ చేసిన ఇండియన్ అండర్ 19 టీమ్.. తర్వాత తొలి ఇన్నింగ్స్లో 589 పరుగుల భారీ స్కోరు చేసింది.
ఓపెనర్ అథర్వా తైడె 113 పరుగులు, ఆయుష్ బదోనీ 185 పరుగులు చేశారు. గత జులైలో ఇండియన్ అండర్ 19 టీమ్కు అర్జున్ టెండూల్కర్ను ఎంపిక చేశారు. ఇంగ్లండ్లో ఉన్న సీనియర్ టీమ్కు నెట్స్లో బౌలింగ్ చేసిన అర్జున్.. తర్వాత బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో జరిగిన అండర్ 19 క్యాంప్లో కూడా పాల్గొన్నాడు.
ప్రస్తుతం శ్రీలంక 18/0తో రెండో ఇన్నింగ్స్ను కొనసాగిస్తోంది.