ముంబై : టీమ్ ఇండియా క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ తన సహనాన్ని కోల్పోయాడు. కబడ్డీ ప్రపంచకప్ మీడియా సమావేశం సందర్బంగా.. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కపిల్.. ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఇంతకీ సదరు మీడియా ప్రతినిధి ప్రశ్న ఏంటంటే.. 'అక్టోబర్ 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్ కోసం పాకిస్తాన్ కబడ్డీ టీమ్ కు ఎందుకు ఆహ్వానం పంపించలేదు?' అంటూ కపిల్ ను ప్రశ్నించాడు. దీంతో సహనం కోల్పోయిన కపిల్.. 'నువ్వే గనుక హిందూస్తానీ అయి ఉంటే ఈ ప్రశ్న ఎట్టి పరిస్థితుల్లోనే అడిగి ఉండకపోయేవాడివని, ఇలాంటి సందర్బంలో ఈ ప్రశ్న అడగడం సమంజసమేనా?' అంటూ ఘాటుగా స్పందించాడు కపిల్.
యూరీ ఉగ్ర ఘటన తర్వాత దేశవ్యాప్తంగా పాక్ పై తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో సదరు మీడియా ప్రతినిధి పాకిస్తాన్ ను ఎందుకు పిలవలేదు అంటూ ప్రశ్నించడం కపిల్ కు ఆగ్రహం తెప్పించింది. అనంతరం ఇండియా కబడ్డీ టీమ్ జెర్సీని ఆవిష్కరించిన కపిల్.. మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కపిల్ మాట్లాడుతూ.. 'టోర్నమెంట్ కు ఎవరిని ఆహ్వానించాలనే విషయాలన్ని ప్రభుత్వాలన్ని చూసుకుంటాయి. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులుగా.. ఒకవేళ చెరువులో గనుక దుంకమంటే, అందుకు కూడా రెడీ' అంటూ అభిప్రాయపడ్డారు.
ఇకపోతే మూడోసారి జరగబోతున్న కబడ్డీ వరల్డ్ టోర్నమెంట్ లో ఇండియా కబడ్డీ టీమ్ సహా మరో 11 టీమ్ లు పాల్గొనబోతున్నాయి. ఇందులో పాకిస్తాన్ టీమ్ కు చోటు కల్పించలేదు. గతంలో 2004,2007 లో జరిగిన ఈ టోర్నమెంట్ జరగ్గా.. ఇప్పుడు మూడో దఫా టోర్నమెంట్ అక్టోబర్ 7వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.