
కొలొంబో: భారత్, శ్రీలంక క్రికెట్ జట్ల మధ్య జరిగిన 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఫిక్స్ అయిందంటూ లంక మాజీ మంత్రి మహీందానంద అలుత్గామాగే సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. మహీందానంద చేసిన ఆరోపణ ప్రకంపనలు ఇప్పట్లో చల్లారేలాగా లేవు. ఈ అంశంపై లంక ప్రభుత్వం విచారణ ఆరంభించింది.
లంక మాజీ క్రికెటర్, ప్రపంచకప్ సమయంలో సెలక్షన్ కమిటీ ఛైర్మన్గా ఉన్న అరవింద డిసిల్వాను లంక పోలీసులు ఆరు గంటల పాటు విచారించారు. 2011 ప్రపంచకప్ ఫిక్సింగ్కు సంబంధించిన ప్రశ్నలు అడిగారు. మంగళవారం సమన్లు జారీ చేసిన పోలీసులు.. డిసిల్వా స్టేట్మెంట్ను రికార్డు చేసుకున్నారు. ఆ తర్వాత మాజీ క్రికెటర్ ఉపుల్ తరంగను విచారిస్తామని తెలిపారు.
2011 వన్డే ప్రపంచకప్పై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సైతం స్వతంత్ర విచారణ జరిపించాలని అరవింద డిసిల్వా కోరారు. అవసరమైతే విచారణ కోసం భారత్కు వస్తానని కూడా ఆయన పేర్కొన్నారు. లంక వ్యాప్తంగా రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన ఈ ఆరోపణలను ఆ దేశ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే విచారణను వేగవంతం చేసింది. ఇప్పటికే మహిదానందను దర్యాప్తు విభాగం విచారించింది.
జూన్ 15న మహీందానంద అలుత్గామాగే ఫిక్సింగ్ ఆరోపణలు చేశారు. ఇందులో ఆటగాళ్ల ప్రమేయం మాత్రం లేదన్నారు. కాగా ఆయన వ్యాఖ్యలను లంక మాజీ క్రికెటర్లు ఖండించారు. 'ఎన్నికలేమైనా ఉన్నాయా!!. మళ్లీ సర్కస్ మొదలైంది' అంటూ కుమార సంగక్కర, తిలకరత్నే దిల్షాన్ విమర్శించారు. ప్రస్తుతం మహీందానంద మరో శాఖకు మంత్రిగా పనిచేస్తున్నారు.