
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లకు ఉన్న రేంజ్ వేరు. వెస్టిండీస్ దీవుల్లో కరేబియన్ ప్రీమియర్ లీగ్, పాకిస్తాన్లో సూపర్ లీగ్ టోర్నమెంట్స్.. వంటివి ఉన్నా ఐపీఎల్కు ఉన్న డిమాండ్ అధికం. ఐపీఎల్ టోర్నమెంట్ను నిర్వహించడం వల్ల వేల కోట్ల రూపాయలను ఆర్జిస్తోంది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు. మొన్నటికి మొన్న ఐపీఎల్లో కొత్తగా వచ్చిన గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంఛైజీల వల్ల బీసీసీఐకి 8,000 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం లభించింది.
ఐపీఎల్ మ్యాచ్లను ప్రసారం చేయడానికి ఉద్దేశించిన మీడియా హక్కులను కేటాయించే విషయంలోనూ బీసీసీఐపై కనకవర్షం కురుస్తుంటుంది. ఒక్కసారి మీడియా హక్కులను పొందగలిగితే- అయిదు సంవత్సరాల పాటు ఢోకా ఉండదు. చేసిన ఖర్చు కంటే ఎన్నో రెట్లు లాభాలను ఆర్జించే అవకాశం ఉంటుంది. మ్యాచ్ జరిగే సమయంలో ఏ చిన్న గ్యాప్ దొరికినా వాణిజ్య ప్రకటనలను ప్రసారం చేసే వెసలుబాటు ఉంది. ఫలితంగా ప్రసార హక్కుల కోసం పోటీ పడుతుంటాయి కార్పొరేట్ కంపెనీలు.
ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. వచ్చే అయిదు సంవత్సరాల మీడియా హక్కుల పీరియడ్ కోసం కార్పొరేట్ కంపెనీలు బీసీసీఐ ముందు బారులు తీరాయి. 2023 నుంచి 2027 సీజన్ వరకు నిర్వహించే ఐపీఎల్ మ్యాచ్ల హక్కుల కోసం తమ టెండర్ డాక్యుమెంట్లను దాఖలు చేశాయి. ఈ విషయంలో ఇదివరకటి కంటే తీవ్ర పోటీ నెలకొనడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కార్పొరేట్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఈ జాబితాలో స్టార్ నెట్వర్క్, జీ నెట్వర్క్, సోనీ ఎంటర్టైన్మెంట్స్, టీవీ18-వయాకామ్, డిస్నీ ఉన్నాయి.

జెఫ్ బెజోస్ సారథ్యాన్ని వహిస్తోన్న ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ సైతం ఈ లిస్ట్లో ఉంది. ఐపీఎల్ మ్యాచ్ల ప్రసార హక్కుల కోసం పోటీ పడుతోంది. వీటితో పాటు మరో రెండు కంపెనీలు ఈ జాబితాలో కనిపించడం ఆసక్తిగా మారింది. ఒకటి- యూట్యూబ్, రెండు- యాపిల్. ఈ రెండు కంపెనీలు కూడా ఈ సారి మీడియా హక్కుల కోసం పోటీ పడుతున్నాయి.
మిగిలిన కంపెనీల కంటే కాస్త భారీ రేటును కోట్ చేసే అవకాశాలు లేకపోలేదు. ఈ రేసులో నెగ్గుకు రాగలిగితే- ఐపీఎల్ మ్యాచ్లను యూట్యూబ్లో చూసే వీలు ఉంటుంది. మరో పేరు తెలియని కంపెనీ కూడా టెండర్ పత్రాలను దాఖలు చేసింది. ఈ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కు చెందినవిగా భావిస్తున్నారు.