
ఐపీఎల్ తరహాలో శ్రీరామ్ ఆంధ్రా ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ను ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఏపీఎల్ తొలి సీజన్ విజేతగా కోస్టల్ రైడర్స్ నిలిచింది. ఇక ఫైనల్ విశాఖపట్టణంలోని వైఎస్సార్ స్టేడియంలో ఫ్లడ్లైట్ల వెలుతురులో జరిగింది. ఫైనల్లో కోస్టల్ రైడర్స్, బెజవాడ టైగర్స్ జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన కోస్టల్ రైడర్స్ నిర్ణీత 20ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 176పరుగులు చేయగలిగింది. ఆ జట్టు బ్యాటర్లలో మన్యాల ప్రణీత్ (44పరుగులు 27బంతుల్లో 4ఫోర్లు, 3సిక్సర్లు), సీర్ల శ్రీనివాస్ (40పరుగులు 20బంతుల్లో 3ఫోర్లు, 3సిక్సర్లు) సత్తా చాటారు. మనీష్ గోలమోరు, లలిత్ మోహన్ తలా 3వికెట్లు తీసి చెలరేగారు.
ఇక తర్వాత బ్యాటింగ్ చేసిన బెజవాడ టైగర్స్ 20ఓవర్లకు 7వికెట్లు కోల్పోయి 169పరుగులు మాత్రమే చేసింది. దీంతో కోస్టల్ రైడర్స్ 7పరుగుల తేడాతో గెలుపొందింది. ఇక విజేతగా నిలిచిన కోస్టల్ రైడర్స్ జట్టు ట్రోఫీతో పాటు రూ.25 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని అందుకుంది. ఇక రన్నరప్గా నిలిచిన బెజవాడ టైగర్స్ రూ.15లక్షల నగదు ప్రోత్సాహాకాన్ని అందుకుంది. పర్పుల్ క్యాప్ హోల్డర్గా లలిత్ మోహన్ (10వికెట్లు) నిలవగా, ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా (188రన్స్) ప్యాలా అవినాష్ నిలిచాడు.
ఇకపోతే ఈ మెగా క్రికెట్ ఈవెంట్లో మొత్తం ఆరు జట్లు తలపడ్డాయి. జులై 6వ తేదీ నుంచి మ్యాచ్లు జరిగాయి. మ్యాచ్లన్నీ విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో షెడ్యూల్ చేశారు. ఇక ఈ టోర్నీలో రాయలసీమ కింగ్స్, ఉత్తరాంధ్ర లయన్స్, గోదావరి టైటాన్స్, కోస్టల్ రైడర్స్, బెజవాడ టైగర్స్, వైజాగ్ వారియర్స్ పేర్లతో ఫ్రాంచైజీలు ఏర్పడ్డాయి. ఒక్కో ఫ్రాంఛైజీలో మొత్తం 20మంది ప్లేయర్లున్నారు. జట్టు యాజమాన్యాల విషయానికొస్తే రాయలసీమ కింగ్స్- దశరథ రామిరెడ్డి, ఉత్తరాంధ్ర లయన్స్- కేవీఆర్ ఎస్టేట్స్, గోదావరి టైటాన్స్- మాల్విన్ గ్లోబల్, కోస్టల్ రైడర్స్- సూర్య గ్రానైట్స్, బెజవాడ టైగర్స్- ఆంధ్రా హాస్పిటల్స్, వైజాగ్ వారియర్స్- పల్సస్ గ్రూప్ నెలకొల్పారు.