
హైదరాబాద్: వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ సాధించడం ఎలాగో తనకు తెలుసని టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అన్నాడు. కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ప్రస్తుతం సుదీర్ఘ సిరిస్ కోసం దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.
ఆతిథ్య దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్లో భాగంగా తొలి టెస్టు మ్యాచ్ కేప్ టౌన్ వేదికగా జనవరి 5న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు. 'నేను ఈడెన్లో 264 పరుగులు చేసిన తర్వాత నన్ను 300 గురించి అడిగారు. అయితే నేను వారిని రిలాక్స్ అవ్వాలని చెప్తున్నాను' అని అన్నాడు.
'264కు 300కు తేడా కేవలం 36 పరుగులే. అది పెద్ద స్కోరేం కాదు కదా! నేను అప్పడు దానిని చిన్న లక్ష్యంగా భావిస్తాను. ఆ పరుగులు ఎలా చేయాలో నాకు తెలుసు. అయితే నేను వ్యక్తిగత రికార్డుల గురించి ఆలోచించను. మంచి పిచ్లో ఆడితే ప్రయోజనం ఉంటుంది. అదే సవాల్ విసిరే వికెట్పై ఆడితే తగినంత సమయం తీసుకోవాల్సి ఉంటుంది' అని రోహిత్ శర్మ తెలిపాడు.
'ఆ లాజిక్ను తెలుసుకున్నాను కాబట్టే నేను వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేశాను. ఒక టాప్ ఆర్డర్ బ్యాట్స్మన్ 50 ఓవర్ల పాటు ఆడితే ట్రిపుల్ సెంచరీ చేయడం పెద్ద కష్టమేమీ కాదు' అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. వన్డేల్లో వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్, సచిన్ టెండూల్కర్, మార్టిన్ గుప్టిల్లు మాత్రమే డబుల్ సెంచరీ చేశారు.
అయితే రోహిత్ శర్మ అందుకు భిన్నంగా మూడు డబుల్ సెంచరీలు నమోదు చేసి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఇటీవలే మొహాలి వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో మూడో డబుల్ సెంచరీ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన ఒకే ఆటగాడిగా అరుదైన రికార్డు నెలకొల్పాడు.