సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టులో కేఎల్ రాహుల్ (101) వీరోచిత శతకం సాధించాడు. 121/6తో కష్టాల్లో ఉన్న టీమిండియా 245 పరుగులు చేసిందంటే అది రాహుల్ పోరాటంతోనే. అయితే సెంచరీ సాధించిన అనంతరం కేఎల్ రాహుల్ మాట్లాడాడు. విమర్శలను తానెలా అధిగమించాడో వివరించాడు.
''గాయంతో ఎంతో కాలం క్రికెట్కు దూరమయ్యా. మునపటిలా కోలుకోవడానికి కష్టపడ్డా. ఈ విషయాలు నాపై ప్రభావం చూపకుండా ప్రశాంతంగా ఉండటానికి తీవ్రంగా ప్రయత్నించా. సోషల్ మీడియాలో నా ఫీలింగ్స్ను చెప్పుకోవడానికి ఇష్టపడను. అలా చెప్పాలనుకునేవారు ఇప్పటికీ చెబుతుంటారు. అయితే ప్రజల నుంచి నెగెటివ్ కామెంట్స్ తప్పించుకోవాలంటే గొప్ప ప్రదర్శనలు చేయాల్సిందే. నేను కేవలం నా ఆటపైనే దృష్టి పెడుతుంటా. బయటి విషయాలు పట్టించుకోకపోవడం చాలా మంచిది''

''ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడే ప్లేయర్కు ప్రతి రోజు, ప్రతి క్షణం సవాలుగా ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ఈ రోజు నన్ను పొగుడుతున్నారు. మూడు, నాలుగు నెలల క్రితం విమర్శించారు. ఇదంతా ఆటలో భాగమే. అయితే విమర్శలు నాపై ప్రభావం చూపవని చెప్పను. కానీ ఈ విషయాలకు దూరంగా ఉండటమే మంచిది. ఎంత వరకు తీసుకోవాలనే స్పష్టత ఉంటే మెరుగ్గా రాణించవచ్చు.
''గొప్ప ప్లేయర్లు కూడా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే విమర్శలు తమను ప్రభావితం చేయలేవని కొందరు చెబుతుంటారు. కానీ ఆ విషయంలో వారు కచ్చితంగా అబద్ధాలే చెబుతున్నట్లే'' అని రాహుల్ అన్నాడు. కాగా, రెండో రోజు ఆట ముగిసేసరికి సౌతాఫ్రికా అయిదు వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది. తన కెరీర్లో చివరి టెస్టు సిరీస్ ఆడుతున్న డీన్ ఎల్గర్ (140*) సెంచరీతో సత్తాచాటాడు. టీమిండియా బౌలర్లలో బుమ్రా, సిరాజ్ చెరో రెండు వికెట్లు, ప్రసిధ్ కృష్ణ ఒక వికెట్ తీశాడు.