రాజస్థాన్ రాయల్స్ కీలక మ్యాచ్లో పంజా విసిరింది. అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో నాలుగు వికెట్లు తేడాతో విజయం సాధించింది. ఫైనల్లో స్థానం కోసం క్వాలిఫయిర్-2లో చెపాక్ వేదికగా శుక్రవారం సన్రైజర్స్ హైదరాబాద్తో రాజస్థాన్ తలపడనుంది. అయితే ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో విజయం సాధించినప్పటికీ ఆర్ఆర్ యువ ప్లేయర్లు రియాన్ పరాగ్- ధ్రువ్ జురెల్ చేసిన పొరపాటుపై గవాస్కర్ సీరియస్ అయ్యాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 172 పరుగులు చేసింది. రజత్ పటిదార్ (34; 22 బంతుల్లో, 2x4, 2x6), విరాట్ కోహ్లి (33; 24 బంతుల్లో, 3x4, 1x6) టాప్ స్కోరర్లు. అవేశ్ ఖాన్ (3/44) మూడు, అశ్విన్ (2/19) రెండు వికెట్లు తీశారు. అనంతరం రాజస్థాన్ రాయల్స్ 19 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. యశస్వీ జైస్వాల్ (45; 30 బంతుల్లో, 8x4), రియాన్ పరాగ్ (36; 26 బంతుల్లో, 2x4, 2x6) రాణించారు.

అయితే రాజస్థాన్ ఛేదన ఆఖరి వరకు సాఫీగా సాగలేదు. కామెరూన్ గ్రీన్ చక్కని స్పెల్, విరాట్ కోహ్లి మెరుపు ఫీల్డింగ్తో మిడిల్ ఓవర్లలో ఆర్సీబీ తిరిగి పోటీలోకి వచ్చింది. గ్రీన్ బౌలింగ్లో పరాగ్ షాట్కు యత్నించి డబుల్కు ప్రయత్నించాడు. కానీ చిరుతలా బంతి దగ్గరకు దూసుకొచ్చిన కోహ్లి మెరుపు త్రో విసిరి నాన్స్ట్రైకర్లో ఉన్న ధ్రువ్ జురెల్ను రనౌట్ చేశాడు. రెండో పరుగు కోసం వెళ్లాలా వద్దా అని సంకోచిస్తూ వెళ్లిన ధ్రువ్ గురించి సునీల్ గవాస్కర్ మాట్లాడాడు.
''త్రో చాలా ముఖ్యం. ఫ్లాట్గా వచ్చింది. ఒక్కసారి మీరు సంకోచిస్తే ముందుకు వెళ్లోద్దు. అక్కడ ఫీల్డర్ ఎవరున్నారో మీరు చూశారా? అది రెండో పరుగు కోసమా? కోహ్లి కాకుండా మరో ఫీల్డర్ ఎవరైనా ఉంటే ప్రయత్నించవచ్చు. కానీ అతను ఉంటే అది సాహసమే. కోహ్లి అద్భుతమైన ప్రతిభ చూపించాడు. ఆర్సీబీని తిరిగి పోటీలోకి తీసుకువచ్చాడు'' అని సునీల్ గవాస్కర్ అన్నాడు.