

లండన్: ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య నాటింగ్హామ్ వేదికగా మూడో టెస్టు మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో తృటిలో సెంచరీని చేజార్చుకున్న విరాట్ కోహ్లీ రెండో ఇన్నింగ్స్లో మాత్రం సెంచరీతో చెలరేగాడు.
టెస్టుల్లో ఇది విరాట్ కోహ్లీకి 23వ సెంచరీ కావడం విశేషం. తద్వారా కెప్టెన్గా అత్యధిక సెంచరీలు చేసిన గ్రేమ్స్మిత్(25), రికీ పాంటింగ్(19) తర్వాత కోహ్లీ(16) మూడోస్థానంలో ఉన్నాడు. అంతేకాదు ఇంగ్లాండ్తో ఓ టెస్ట్ సిరీస్లో కెప్టెన్గా అత్యధిక పరుగులు(440) రికార్డును కోహ్లీ నెలకొల్పాడు.
ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్(426 పరుగులు) రికార్డుని కూడా కోహ్లీ అధిగమించాడు. ఇదిలా ఉంటే, మూడో టెస్టులో కోహ్లీ సెంచరీ చేసిన అనంతరం గ్యాలరీలో ఉన్న అనుష్కకు ముద్దులు విసురుతూ కనిపించాడు. దీనికి ప్రతిగా అనుష్క సైతం చప్పట్లతో కోహ్లీని అభినందిస్తూ ముద్దులు విసిరింది.
ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ టెస్టు రెండో ఇన్నింగ్స్లో కోహ్లీ 103 పరుగులు నమోదు చేశాడు. ఇదే ఇంగ్లాండ్ పర్యటనలో ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన తొలిటెస్టులో కోహ్లీ సెంచరీ సాధించిన వెంటనే తన మెడలో ఉన్న నిశ్చితార్థ ఉంగరాన్ని ముద్దు పెడుతూ కనిపించిన సంగతి తెలిసిందే.
కాగా, మూడో టెస్టులో కోహ్లీసేన పట్టు బిగించింది. ఆతిథ్య ఇంగ్లాండ్ ముందు భారత్ 521 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించాలంటే ఇంకా 498 పరుగులు చేయాలి. ఐదు రోజుల ఆటలో ఇంకా రెండు రోజుల ఆట మాత్రమే మిగిలి ఉంది.