ముంబై: ఆస్ట్రేలియాపై జరిగిన ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచులో తన ప్రియుడు విరాట్ కోహ్లీ వైఫల్యంతో తీవ్ర నిరాశకు గురైన బాలీవుడ్ నటి అనుష్క శర్మ భలే చాన్స్ కొట్టబోతోంది. ఆమెకు ఆనందాన్ని ఇచ్చే వార్త వెలుగు చూసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె ప్రదర్శన ఇస్తుందని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.
అనుకున్న ప్రకారం అంతా జరిగితే ఐపియల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అనుష్క శర్మ ప్రదర్శన ఏర్పాటు చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రారంభోత్సవాన్ని అదరగొట్టడదానికి బాలీవుడ్ స్టార్స్ వరుణ్ ధావన్, రితిక్ రోషన్ తదితరులను ఆహ్వానించాలని బిసిసిఐ అనుకుంటోంది.

చర్చలు ఫలిస్తాయని, ప్రారంభోత్సవ కార్యక్రమంలో అనుష్క శర్మ పాల్గొంటుందని ఆశిస్తున్నామని బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) కోశాధికారి విశ్వరూప్ దూబే అన్నట్లు వార్తలు వచ్చాయి. బోర్డు అనుష్క శర్మతో చర్చలు జరుపుతోందని, త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తుందని అన్నారు.
ఆశ్చర్యకరమైన కార్యక్రమాలు ఉంటాయని, ఐపియల్ ప్రారంభోత్సవం ఎప్పటికీ గుర్తుండిపోయేలా నిర్వహిస్తామని ఆయన అన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యేకత ఉట్టిపడేలా నిర్వహించాలని అనుకుంటున్నట్లు తెలిపారు.