ముంబై: భారత క్రికెటర్ విరాట్ కోహ్లీతో తనకున్న సంబంధంపై బాలీవుడ్ కథానాయిక అనుష్క శర్మ తాజాగా మరోసారి స్పందించారు. అతనితో తన సంబంధం రహస్య వ్యవహారం కాదని పేర్కొన్నారు. ఈ విషయం గురించి పబ్లిక్గా మాట్లాడటం తనకు ఇష్టముండదని స్పష్టం చేశారు.
ఈ మేరకు ఓ గ్రూప్ ఇంటర్వ్యూలో అనుష్క మాట్లాడుతూ.. 'ఎవరూ ఏదీ దాచలేదు. చాలా సాధారణంగా మా జీవితాన్ని గడుపుతున్నాం. మా ఇద్దరి మధ్య సంబంధం గురించి బయట మాట్లాడాలని కోరుకోవడం లేదు. దీన్నొక వినోద వార్త అంశంగా చేయదల్చుకోలేదు' అని స్పష్టం తెలిపారు.
'మా ఇద్దరినీ కలిపి చూసినప్పుడు ఏదీ దాచం. కానీ మాట్లాడం' అని అనుష్క శర్మ మీడియాకు చెప్పారు. అయితే తన వ్యక్తిగత జీవితం గురించి కేవలం స్నేహితులతో చెప్పాలనుకుంటున్నానని.. ప్రపంచానికి కాదని అనుష్క శర్మ తెలివిగా సమాధానం చెప్పారు.
ప్రస్తుతం అనుష్క శర్మ తను నటించిన బాలీవుడ్ చిత్రం 'పికె' ప్రమోషన్లలో పాల్గొంటూ బిజీగా గడుపుతున్నారు. తనకు గొప్పవారి జీవిత చరిత్ర ఆధారంగా తీసే సినిమాల్లో నటించాలని ఉందని అనుష్క శర్మ తెలిపారు. ఆ అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని చెప్పారు.