
హైదరాబాద్: 'నువ్వెప్పుడూ నన్ను సంతోషంగా ఉంచుతావ్' శుక్రవారం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి అనుష్క శర్మ తన ట్విట్టర్లో పోస్టు చేసిన కామెంట్ ఇది. విరాట్ కోహ్లీని ప్రేమగా హత్తుకున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అనుష్క శర్మ ఈ కామెంట్ పెట్టింది.
ఈ ఫొటో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. అనుష్క పోస్ట్ చేసిన కొద్దిసేపటికే ఈ ఫొటోకు తొమ్మిదివేల మందికి పైగా లైకులు వచ్చాయి.
అంతకముందు సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టులో భారత తొలి ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ మైదానంలో ఆడుతున్న సమయంలో గ్యాలరీలో ఉన్న అనుష్క శర్మ చప్పట్లు కొడుతూ సందడి చేశారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న చివరి టెస్టులో భాగంగా అనుష్క శర్మ కూడా విరాట్ కోహ్లీతో పాటు సిడ్నీకి వెళ్లారు.
అక్కడే నూతన సంవత్సర వేడుకలను జరుపుకొన్నారు. గురువారం కోహ్లీ మైదానంలోకి అడుగుపెట్టగానే అనుష్క స్టాండింగ్ గ్యాలరీలో నిలబడి తెగ చప్పట్లు కొట్టారు. ఆ సమయంలో ఫొటోగ్రాఫర్లు అనుష్క వైపు చూడగానే ఆమె సిగ్గుపడుతూ నవ్వారు. ఈ సందర్భంగా తీసిన అనుష్క ఫొటోలు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి.

చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమిండియా బ్యాట్స్మెన్ అదరగొట్టారు. దీంతో తొలి ఇన్నింగ్స్ను కోహ్లీసేన 622/7 వద్ద డిక్లేర్ చేసింది. ఆటలో భాగంగా రెండో రోజైన శుక్రవారం ఓవర్ నైట్ స్కోరు 303/4తో తొలి ఇన్నింగ్స్ని కొనసాగించిన టీమిండియాలో పుజారా (193), రిషబ్ పంత్ (159 నాటౌట్) సెంచరీలు నమోదు చేయడంతో భారీ స్కోరు చేసింది.
ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ లియాన్ 4 వికెట్లు పడగొట్టగా, జోష్ హెజెల్ఉడ్కు రెండు, మిచెల్ స్టార్క్కు ఒక వికెట్ లభించింది. గురువారం ప్రారంభమైన ఈ టెస్టులో తొలిరోజు యువ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (77) హాఫ్ సెంచరీతో రాణించగా, శుక్రవారం ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (81) మెరుపు ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు.