
లోధా కమిటీ నుంచి మాకు సూచనలు అందడం లేదు
‘కోర్టు సూచనలకు మేం కట్టుబడి ఉంటాం. అయితే ప్యానెల్ నుంచి మాకు ఎలాంటి సహాయ సహకారాలు, సూచనలు అందడం లేదు. దీంతో మేం ఏ విషయంలోనూ ముందుకెళ్లడం లేదు. ఇది అంతిమంగా భారత క్రికెట్కు హాని చేస్తుంది. బీసీసీఐ ప్రతిష్టను కూడా మసకబారుస్తుంది. అంతేకాకుండా బీసీసీఐ పాలనావ్యవహారాల అధికారాన్ని మూడో పార్టీకి లోధా కమిటీ బదలాయించలేదు' అని పేర్కొన్నారు.

హోం శాఖ మాజీ కార్యదర్శికి క్రికెట్ను ఎలా నడుపుతారు
'అసలు హోం శాఖ మాజీ కార్యదర్శికి క్రికెట్ను నడపడం ఎలా సాధ్యమవుతుంది? దీన్ని మేం ఎంతమాత్రం అంగీకరించం. నిజానికి లోధా కమిటీ ప్రతిపాదనలు క్రికెట్కు మేలు చేసేలా కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా క్రికెట్ పరిపాలనను బలహీనపరిచేలా ఉన్నాయి. దీంతో బీసీసీఐ ఒక వీక్ ఆర్గనైజేషన్గా మారి అంతర్జాతీయ వేదికపై తన గళాన్ని వినిపించే శక్తిని కోల్పోతుంది' అని ఠాకూర్ అందులో పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ తమను ఎలా తొలగిస్తారు
తాము పేర్కొన్న ప్రతిపాదనల అమలులో విఫలమవుతున్నందుకు బోర్డులోని ఆఫీస్ బేరర్లందరినీ తొలగించాలని సుప్రీం కోర్టుకు నవంబర్ 21న తాము సమర్పించిన మూడో నివేదికలో లోధా కమిటీ కోరిన సంగతి తెలిసిందే. అయితే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ తమను తొలగిస్తే కలిగే లాభమేమిటని ఠాకూర్ ప్రశ్నించారు.

ఇది ఎంతమాత్రం క్రికెట్కు లాభం చేకూర్చదు
‘ఆయా క్రికెట్ సంఘాల నిబంధనలకు లోబడి చట్టబద్ధంగా ఎన్నికైన ఆఫీస్ బేరర్లను తొలగించాలని చెప్పడం సరైన నిర్ణయం కాదు. ఇది ఎంతమాత్రం క్రికెట్కు లాభం చేకూర్చదు. ఈ నిర్ణయం వల్ల వెంటనే పరిపాలన కుప్పకూలుతుంది. మొత్తం భారత క్రికెట్ గందరగోళంలో పడుతుంది' అని చెప్పారు.

రాష్ట్ర క్రికెట్ సంఘాలు సైతం నిరాకరణ
కాగా, లోధా కమిటీ సూచించిన ప్రతిపాదనలను బీసీసీఐ అనుబంధ రాష్ట్ర క్రికెట్ సంఘాలు అమలు చేసేందుకు నిరాకరిస్తున్నాయని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. వీటి కోసం తాము మూడుసార్లు సమావేశమయ్యామని, అన్నిసార్లూ వారు తిరస్కరించారని తెలిపారు. ‘అధ్యక్షుడిగా నా బాధ్యతలు నిర్వర్తించేందుకు వారితో సమావేశమయ్యాను. ఓటింగ్ ద్వారా వారు కొత్త ప్రతిపాదనలను తిరస్కరించారు' అని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications











