ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నూతన అధ్యక్షుడిగా అనురాగ్ ఠాకూర్ ఎన్నికయ్యారు. ముంబైలో ఆదివారం జరిగిన బోర్డు ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో అనురాగ్ ఠాకూర్ను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐసీసీ ఛైర్మన్ పదవి చేపట్టడం కోసం బీసీసీఐ అధ్యక్ష పదవికి శశాంక్ మనోహర్ కొద్దిరోజుల క్రితం రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
కాగా, బీసీసీఐ అధ్యక్ష పదవికి ఠాకూర్ ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. శనివారం బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ సమక్షంలో ఆయన నామినేషన్ వేశారు.
ప్రస్తుత బోర్డు అధ్యక్షుడిని ప్రతిపాదించే అధికారం ఈస్ట్జోన్దే. ఆ జోన్లో ఒక సంఘం ప్రతిపాదించినా అధ్యక్ష పదవికి పోటీ చేయొచ్చు. అయితే భారతీయ జనతా పార్టీ ఎంపీ కూడా అయిన ఠాకూర్కు ఈస్ట్జోన్లోని ఆరు సంఘాలూ నామినేషన్ పత్రాలపై సంతకాలు చేయడం విశేషం.
దీంతో అతి తక్కువ వయస్సు(41)లో బీసీసీఐ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా అనురాగ్ ఠాగూర్ చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న అనురాగ్ ఠాకూర్ బోర్డు అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో ఆ పదవి ఖాళీ అయింది. దీంతో ఠాకూర్ స్థానంలో మహారాష్ట్ర క్రికెట్ సంఘంఅధ్యక్షుడైన షిర్కే బీసీసీఐ కార్యదర్శి పగ్గాలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.